Dailyhunt
రీఛార్జ్ చేయలేదని యువతి ఆత్మహత్య!

రీఛార్జ్ చేయలేదని యువతి ఆత్మహత్య!

వార్త 1 week ago

Hyderabad Crime: చిన్న చిన్న కారణాలకే యువత తమ విలువైన ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి.

తాజాగా హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోన్ రీఛార్జ్ చేయలేదన్న చిన్న కారణంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.

Read Also: Guntur News: ఐరా 'స్పా' మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!

Hyderabad Crime: సహజీవనం చేస్తుండగా ఘటన

పోలీసుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్‌ ప్రశాంత్‌నగర్‌లో నివాసం ఉంటున్న కిరణ్మయి(26)కి గతంలో వివాహం జరగ్గా, మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడిపోయింది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. నాలుగేళ్ల క్రితం బ్యూటీషియన్‌ కోర్సు నేర్చుకున్న కిరణ్మయి, ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే వెంకటేశ్‌ (చందు) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. గత ఏడాది కాలంగా వీరిద్దరూ ప్రశాంత్‌నగర్‌లో సహజీవనం చేస్తున్నారు.

రీఛార్జ్ చిచ్చు.. ఉరి వేసుకొని మృతి

రెండు రోజుల క్రితం కిరణ్మయి మొబైల్ రీఛార్జ్‌ గడువు ముగిసింది. జీతం రాకపోవడంతో రీఛార్జ్ చేయాలని చందును కోరింది. అయితే అతను రీఛార్జ్ చేయకపోవడంతో శుక్రవారం ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిరణ్మయి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చందుపై అనుమానం ఉందని మృతురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి ఇలా చిన్న కారణంతో తనువు చాలించడం స్థానికంగా కలకలం రేపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha