AE Nookaraju Case : ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) టిల్లపూడి నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్యల ఆత్మహత్య వ్యవహారంలో ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్ వేధింపులే కారణమని కాకినాడ జిల్లా ఎస్పీ జి.
బిందుమాధవ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసి, ఘటనా స్థలంలో లభ్యమైన రెండు ఆత్మహత్య లేఖలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నూకరాజు మరియు సౌజన్య రాసిన సూసైడ్ నోట్లలో సాధిక్ ఖాన్ వేధింపుల వల్లే తాము తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నామని స్పష్టంగా పేర్కొన్నారని, ఆ లేఖల ఆధారంగానే దర్యాప్తును వేగవంతం చేశామని ఆయన తెలిపారు.

యూపీలో నిందితుడి అరెస్ట్ – కస్టడీ విచారణకు సిద్ధం
ఘటన జరిగిన వెంటనే మొబైల్ ఫోన్లు వాడకుండా పరారైన నిందితుడు సాధిక్ ఖాన్ను పట్టుకునేందుకు 10 ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించామని ఎస్పీ తెలిపారు. దేశంలోని 5 రాష్ట్రాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి, ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లోని మీరట్లో నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి, పోలీస్ కస్టడీకి కోరనున్నామని… కస్టడీలోకి తీసుకుని విచారిస్తే వేధింపుల వ్యవహారంతో పాటు మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని బిందుమాధవ్ పేర్కొన్నారు.

