Sai Krishna Case: ఆంధ్రప్రదేశ్లో తీవ్ర కలకలం రేపిన విజయవాడ కస్టడీ మరణం కేసులో కీలక చట్టపరమైన ముందడుగు పడింది. ఈ కేసులో ముఖ్య నిందితుడిగా ఉన్న కృష్ణలంక సస్పెండెడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) ఎస్.ఎస్.వి.వి.
నాగరాజుకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల అనంతరం ఉన్నతాధికారులు ఆయనను కట్టుదిట్టమైన పోలీస్ కాపలా మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఐదు గంటల విచారణ తర్వాత సీఐ అరెస్ట్
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మంగళవారం నాడు సీఐ నాగరాజును సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించింది. అనంతరం ఆయనను అధికారికంగా అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయస్థానం జులై 8 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా మూడు ప్రత్యేక వాహనాల్లో పోలీసులు ఆయనను విజయవాడ నుండి రాజమండ్రి జైలుకు తీసుకెళ్లారు.
అసలు ఏం జరిగిందంటే..?
గాదె సాయికృష్ణ (25) అనే యువకుడి అక్రమ నిర్బంధం, మరణం కేసులో సీఐ నాగరాజు ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మే 9వ తేదీన మార్కాపురంలో సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని కృష్ణలంక స్టేషన్కు తరలించారని, అక్కడ థర్డ్ డిగ్రీ (చిత్రహింసలు) ఉపయోగించడం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు స్టేషన్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను డిలీట్ చేసి, మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా విద్యుత్ శ్మశానవాటికలో దహనం చేసి ఆధారాలు నాశనం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం ఐజీ ఎం. రవిప్రకాశ్ సారథ్యంలో నలుగురు సభ్యులతో కూడిన ‘సిట్’ను రంగంలోకి దించింది. అక్రమ నిర్బంధం, లాకప్ డెత్, హత్య, సాక్ష్యాల తారుమారు వంటి తీవ్రమైన సెక్షన్ల కింద సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో భాగస్వామ్యమున్న మరికొందరు పోలీసు సిబ్బందిపై కూడా దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
ఆసుపత్రికి వెళ్లి ముద్రగడ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న విజయసాయిరెడ్డి

