Harivansh: నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు తమ డిజిటల్ పరికరాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సూచించారు. సైబర్ ముప్పుల నుంచి పరికరాలను రక్షించుకోవడం ప్రతి సభ్యుడి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

డిజిటల్ పరికరాల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
కొత్త సభ్యుల కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల ‘ప్రారంభ్’ ఓరియెంటేషన్ వర్క్షాప్ ముగింపు వేడుకల్లో ఆదివారం హరివంశ్ ప్రసంగించారు. సభా కార్యకలాపాలు పూర్తిగా డిజిటలైజ్ అవుతున్న తరుణంలో, సభ్యులకు కేటాయించిన డిజిటల్ లాగిన్ వివరాలు సభా ఆస్తులతో సమానమని పేర్కొన్నారు. సైబర్ దాడులు మరియు అనధికారిక యాక్సెస్ నుంచి వాటిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. టెక్నాలజీపై పట్టు సాధించినప్పుడే దేశాన్ని సాంకేతిక విప్లవం వైపు నడిపించడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
Harivansh: సీనియర్ నేతల ప్రసంగాలను అధ్యయనం చేయాలి
ఈ ఓరియెంటేషన్ శిక్షణ కేవలం ఆరంభం మాత్రమేనని, ఎంపీలు నిరంతరం నేర్చుకుంటూ ఉండాలని హరివంశ్ సూచించారు. పార్లమెంటరీ సంప్రదాయాలను, గతంలో జరిగిన కీలక చర్చలను లోతుగా అధ్యయనం చేయాలని కోరారు. అటల్ బిహారీ వాజ్పేయి, అరుణ్ జైట్లీ, చంద్రశేఖర్ వంటి దిగ్గజ పార్లమెంటేరియన్ల ప్రసంగాలను పరిశీలించడంతో పాటు, ఇతర దేశాల పార్లమెంటరీ విధానాలను కూడా గమనించాలని సభ్యులకు హితవు పలికారు.
Epaper: epaper.vaartha.com

