Anasuya Bharadwaj: హిందూ మరియు సనాతన ధర్మంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో, ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఎట్టకేలకు వివరణ ఇచ్చారు.
తన మాటలను కొందరు కావాలనే వక్రీకరించి, ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె తన వైఖరిని స్పష్టం చేశారు.

నేను పక్కా హిందువును.. ఏ మతాన్ని కించపరచలేదు: అనసూయ
తాను ఏ మతాన్ని ఎప్పుడూ కించపరచలేదని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని అనసూయ స్పష్టం చేశారు. తాను సనాతన ధర్మాన్ని పాటించే పక్కా హిందువునని, తన ధర్మం, విలువలు, విశ్వాసాల పట్ల తనకు ఎలాంటి అనుమానం లేదని తేల్చిచెప్పారు. తాను చెప్పిన అసలు విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి, కేవలం వివాదం సృష్టించాలనే ఉద్దేశంతో సనాతన ధర్మాన్ని అవమానించినట్లు ప్రచారం చేయడం తగదని ఆమె హితవు పలికింది.
Anasuya Bharadwaj: వివాదానికి అసలు కారణం ఏమిటి?
గతంలో ఒక సందర్భంలో అనసూయ మాట్లాడుతూ.. ‘జై శ్రీరామ్’ అనే నినాదం ముసుగులో కొందరు వ్యక్తులు దాడులకు తెగబడుతున్నారని, కేవలం నినాదాలు చేయడం కంటే మనుషుల ప్రవర్తన, నైతికతే ముఖ్యమని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం పేరుతో ఇతరులపై దాడులు చేయడాన్ని తాను ప్రశ్నించానని తెలిపారు. తాను శ్రీరాముడినే నిత్యం కొలుస్తానని, ఆ దేవుడిపై ఉన్న భక్తితోనే తన పెద్ద కుమారుడికి హనుమంతుడి పేరు పెట్టుకున్నానని ఆమె గతంలోనే వివరించిన విషయాన్ని గుర్తుచేశారు.
హిందూ సంఘాల నిరసనలతో దిగొచ్చిన యాంకర్
అనసూయ చేసిన ఆ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, పలువురు నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున ట్రోల్స్ రావడంతో పాటు విమర్శలు గుప్పించారు. పరిస్థితి మరింత చేయిజారిపోకుండా చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగానే అనసూయ తాజాగా ఈ స్పష్టమైన వివరణ ఇస్తూ పోస్ట్ పెట్టారు. తన అంతరార్థం ఎవరినీ నొప్పించడం కాదని, భక్తి ముసుగులో జరిగే తప్పులను మాత్రమే ఎత్తిచూపానని ఆమె పేర్కొన్నారు.

