Nakrekal 100 Bed Hospital: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్హెచ్-65) పరివాహక ప్రాంతాల ప్రజలతో పాటు నకిరేకల్ నియోజకవర్గ వాసుల దశాబ్దాల కల నెరవేరబోతోంది.
రూ.32 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఈనెల 5వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే నకిరేకల్తో పాటు కట్టంగూర్, కేతేపల్లి తదితర పరిసర మండలాల ప్రజలకు అత్యుత్తమ ఉచిత వైద్య సేవలు చేరువ కానున్నాయి.
Read Also : KCR Resign : కేసీఆర్ రాజీనామా చేస్తే రేవంత్ తట్టుకోగలడా ? కేటీఆర్ సూటి ప్రశ్న
CM Revanth Reddy to inaugurate a 100-bed hospital on September 5.
గతంలో పరిమిత వసతులతో ఉన్న ఆస్పత్రి రోజుకు 350కి పైగా వచ్చే ఓపీ రోగుల అవసరాలను తీర్చలేకపోయేది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను అత్యవసర చికిత్స కోసం నల్గొండ లేదా హైదరాబాద్కు తరలించాల్సి వచ్చేది. దీంతో కీలకమైన 'గోల్డెన్ అవర్'లో సరైన వైద్యం అందక అనేకమంది ప్రాణాలు కోల్పోయేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త భవనంలో ట్రామా కేర్ సదుపాయం, ఐసీయూ (ICU), ఆర్థోపెడిక్ విభాగం, అత్యవసర శస్త్రచికిత్స విభాగాలు అందుబాటులోకి రానున్నాయి.
Nakrekal 100 Bed Hospital: అత్యాధునిక వసతులు & ప్రసూతి సేవలు
నూతన ఆస్పత్రి భవనంలో డిజిటల్ ఎక్స్రే, స్కానింగ్ యంత్రాలు, 24 గంటల పాటు పనిచేసే పాథాలజీ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు గర్భిణులకు మెరుగైన ప్రసూతి సేవలు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువుల కోసం ప్రత్యేక కేర్ యూనిట్లను కూడా అందుబాటులోకి తెస్తున్నారు.
ఈ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక చొరవ చూపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా నకిరేకల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్పత్రి ప్రారంభంతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన పలు కొత్త అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి ఈ పర్యటనలో శంకుస్థాపన చేయనున్నారు.

