Shamshabad Land Acquisition: హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ పరిధిలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
శంషాబాద్ బహదూర్గూడలో శనివారం ఉదయం భూసేకరణ పనులను అడ్డుకునే క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన రైతులు పోలీసులపై తిరగబడటంతో స్థానికంగా రణరంగం నెలకొంది.
బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం బహదూర్గూడ పరిధిలో దాదాపు 600 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, తమ జీవనాధారమైన భూములను ఇచ్చేది లేదంటూ గత ఐదు రోజులుగా రైతులు ఉధృతంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం అధికారులు భూసేకరణకు పూనుకోగా.. రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహించిన రైతులు పోలీసుల కళ్లలో కారం చల్లి, వారిపైకి రాళ్లు, కుర్చీలు విసిరి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
Read Also : Chegunta Government School: ప్రభుత్వ పాఠశాలల నుంచే గొప్ప విజయాలు సాధ్యం.. మంత్రి వివేక్
High tension in Shamshabad… Farmers turn against the police.
Shamshabad Land Acquisition: డీసీపీ, సీఐలకు గాయాలు..
రైతులు ఒక్కసారిగా దాడికి దిగడంతో పోలీసులు తీవ్ర అప్రమత్తమయ్యారు. అయినప్పటికీ ఈ దాడుల్లో శంషాబాద్ జోన్ డీసీపీ (DCP) యోగేష్ గౌతమ్తో పాటు పలువురు సర్కిల్ ఇన్స్పెక్టర్లకు, కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన అధికారులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత చేజారిపోకుండా చూసేందుకు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి అదనపు బలగాలను రప్పించారు.
రైతుల భూపోరాటానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బహదూర్గూడకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు అండగా నిలిచారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకుని, వారిని ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. తమ ప్రాణాలు పోయినా సరే 600 ఎకరాల భూమిని వదులుకోబోమని రైతులు తెగేసి చెబుతుండటంతో శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

