AP JAC : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దారితీశాయి. పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు, పీఆర్సీ, మధ్యంతర భృతి (ఐఆర్), డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసనలకు AP JAC శ్రీకారం చుట్టారు.
సోమవారం 26 జిల్లాల్లో కలెక్టరేట్లకు ఉద్యోగులు భారీగా తరలివెళ్లి అధికారులకు ఉద్యమ నోటీసులు అందించారు. 'సీఎం సార్.. మా డబ్బులు మాకు ఇవ్వండి' అంటూ నినాదాలు చేశారు.
పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఐఆర్తో పాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలను :
ఉద్యోగ సంఘాల ప్రకారం.. తమకు రావాల్సిన సుమారు రూ.40 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు. ఐదు పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఐఆర్తో పాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలపై గతంలో ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పటికీ, స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవడంతో ఉద్యమానికి దిగాల్సి వచ్చిందని జేఏసీ నేతలు చెబుతున్నారు.

ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్నారు. అదే సమయంలో 'సీఎం సార్.. మా డబ్బులు మాకు ఇవ్వండి' అనే నినాదాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకుని నిరసన తెలపాలని జేఏసీ పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 3, 5 తేదీల్లో కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నిరసనలు నిర్వహించనున్నారు.
ఇక సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు 'వర్క్ టు రూల్' చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. సెప్టెంబర్ 17న నల్ల కండువాలతో మానవహారం, సెప్టెంబర్ 23న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, సెప్టెంబర్ 26న ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రవ్యాప్త నిరసనలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం స్పందించకపోతే సహాయ నిరాకరణ, రిలే నిరాహార దీక్షలు, 'ఛలో విజయవాడ', చివరికి నిరవధిక సమ్మె దిశగా వెళ్లే అవకాశముందని జేఏసీ హెచ్చరించింది.

