Udayanidhi Stalin: తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కాయి. అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కాస్తా వ్యక్తిగత దూషణల స్థాయికి చేరింది.
మంగళవారం నాటి సభా సమావేశాల్లో ప్రతిపక్ష నేత, డీఎంకే (DMK) యువనేత ఉదయనిధి స్టాలిన్.. ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత జీవితాన్ని, ఆయన విడాకుల వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించడంతో సభలో తీవ్ర గందరగోళం, దుమారం రేగింది.

స్టాలిన్ హావభావాలను అనుకరిస్తూ సీఎం విజయ్ విమర్శలు
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ వివాదం మొదలైంది. తొలుత ముఖ్యమంత్రి విజయ్ సభలో మాట్లాడుతూ.. హిందీ భాషా వివాదం, నీట్ (NEET) పరీక్ష, రైతుల ఆందోళనలు, కరూర్ తొక్కిసలాట వంటి కీలక అంశాలపై స్పందించారు. రైతులను ప్రతిపక్షాలే కావాలని రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. ఇదే సమయంలో గత డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన విజయ్.. గత పాలకులు ప్రజాధనాన్ని లూటీ చేశారని, కేవలం కుటుంబ రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో మాజీ సీఎం ఎం.కే. స్టాలిన్ హావభావాలను విజయ్ వ్యంగ్యంగా అనుకరిస్తూ సభలో మాట్లాడారు.
Udayanidhi Stalin: ‘చిన్న కథ’తో ఉదయనిధి స్టాలిన్ రివర్స్ కౌంటర్
ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ముఖ్యమంత్రి మాట్లాడటం సరికాదన్నారు. అనంతరం సీఎం విజయ్ను టార్గెట్ చేస్తూ ఉదయనిధి తన స్టైల్లో “ఒక చిన్న కథ చెబుతా” అంటూ మాట్లాడటం సభలో సెన్సేషన్ సృష్టించింది.
“చెంగల్పట్టు కోర్టులో ఓ భార్య తన భర్త కోసం వెతుకుతోంది.. ఈ విషయం తమిళనాడులోని ప్రజలందరికీ బాగా తెలుసు” అంటూ విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన అంశాన్ని ఉదయనిధి పరోక్షంగా ప్రస్తావించారు. (సీఎం విజయ్ భార్య సంగీత ఫిబ్రవరి 24న చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 7న జరగనుంది.)
ప్రతి కుటుంబానికి సేవ చేస్తాం: సీఎం విజయ్ స్పష్టత
అంతకుముందు ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ.. తాము గత పాలకుల్లాగా ఒకే కుటుంబానికి దాసోహం అవ్వమని స్పష్టం చేశారు. తమ రాజకీయ విధానం ఒక కుటుంబం చుట్టూ తిరగదని, తమిళనాడులోని ప్రతి సామాన్య కుటుంబానికి సేవ చేయడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని విజయ్ సభలో గట్టిగా పునరుద్ఘాటించారు. ఏదేమైనా, తమిళనాడు అసెంబ్లీలో ఇరు పార్టీల అగ్రనేతల మధ్య జరిగిన ఈ వ్యక్తిగత స్థాయి విమర్శలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో సైతం చర్చనీయాంశంగా మారాయి.

