Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ

వార్త 2 weeks ago

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా సోమవారం అత్యంత కీలకమైన సమావేశాల్లో పాల్గొన్నారు.

ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్, విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్ బాలకృష్ణన్‌లతో సీఎం విడివిడిగా భేటీ అయ్యారు. నవ్యాంధ్రప్రదేశ్ అభ్యున్నతి, పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా సాగిన ఈ చర్చల్లో ఉమ్మడి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై ఇరుపక్షాలు ప్రధానంగా దృష్టి సారించాయి.

ముఖ్యంగా ఏపీలోని ప్రముఖ విమానాశ్రయాల నుండి సింగపూర్‌తో పాటు ఇతర అంతర్జాతీయ ప్రాంతాలకు నేరుగా విమాన సర్వీసులు, ఎయిర్ కనెక్టివిటీని గణనీయంగా పెంచే అవకాశాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయి.

read also: Nara Lokesh: సతీసమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. రాష్ట్ర ప్రగతి కోసం ప్రత్యేక పూజలు

అమరావతి ‘క్వాంటం వ్యాలీ’.. గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ

సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో జరిగిన సమావేశంలో ఏపీలో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను చంద్రబాబు వివరించారు. భవిష్యత్ దార్శనికతతో నిర్మిస్తున్న అమరావతి రాజధాని ప్రణాళికలను ఆయన ముందుంచారు. తయారీ, సేవల రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వేగంగా దూసుకుపోతోందని.. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని ఉపయోగించుకుని పోర్టుల ద్వారా సరకు రవాణాను మెరుగుపరుస్తున్నామని సీఎం వివరించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలవనుందని స్పష్టం చేశారు. అలాగే, విశాఖపట్నంలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్, ప్రపంచాన్ని అనుసంధానించే సబ్-సీ కేబుల్ ప్రాజెక్టుల పురోగతిని తెలియజేశారు. రాజధాని అమరావతిని ‘క్వాంటం వ్యాలీ’గా మారుస్తున్నామని, ఉత్తరాంధ్రలో గ్లోబల్ స్టీల్ దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోందని ఆయన వెల్లడించారు.

Chandrababu Naidu: సెమీకండక్టర్లు, అర్బన్ గవర్నెన్స్‌లో సింగపూర్ సహకారం

దీనికిముందు, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో ఆయన అధికారిక నివాసంలో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు సాగిన ఈ భేటీలో అమరావతితో పాటు ఏపీలోని ఇతర ప్రధాన నగరాల్లో అర్బన్ గవర్నెన్స్ (పట్టణ పరిపాలన) మెరుగుపరచడానికి సింగపూర్ సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలని సీఎం కోరారు. ఐటీ, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాలలో పరిశోధనలకు గానూ విశ్వవిద్యాలయాల మధ్య తోడ్పాటు అవసరమని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన ఎకోసిస్టమ్, కెపాసిటీ బిల్డింగ్‌లో సహకరించాల్సిందిగా కోరారు.

రాష్ట్రంలో ప్రకృతి సేద్యం (Natural Farming) ద్వారా పండిస్తున్న నాణ్యమైన ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునేలా చొరవ చూపాలని చంద్రబాబు కోరారు. వీటికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.

అమరావతిపై సింగపూర్ ప్రధాని ఆసక్తి

ఈ చర్చల సందర్భంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్.. అమరావతి రాజధాని నిర్మాణ ప్రణాళికల గురించి సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు కానున్న అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, మౌలిక వసతులపై ఆసక్తి కనబరిచారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఏపీలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

ఈ ఉన్నత స్థాయి చర్చల్లో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

read also:

ఏపీ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందం.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha