Chhattisgarh HC on Pocso Case : పోక్సో (POCSO) చట్టం కింద నమోదైన కేసులో ఛత్తీస్గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన ప్రాథమిక ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలు లేకుండా కేవలం పాఠశాల రికార్డుల్లో నమోదు చేసిన పుట్టిన తేదీ ఆధారంగా బాధితురాలి వయసును ఖరారు చేయలేమని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో ట్రయల్ కోర్టు నిందితుడికి విధించిన జైలు శిక్షను రద్దు చేస్తూ, అతడిని నిర్దోషిగా తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ రవీంద్ర కుమార్ అగర్వాల్లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది.
Read Also: Kakinada Crime: ప్రేమ పేరుతో మోసగించి బలవంతపు మతమార్పిడి
Chhattisgarh HC on Pocso Case
కేసు నేపథ్యం - ప్రాసిక్యూషన్ ఆధారాలు
ఓ వ్యక్తి మైనర్ బాలికను తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. దీనిని పరిశీలించిన ట్రయల్ కోర్టు నిందితుడిని ఐపీసీ సెక్షన్లు 363, 366 మరియు పోక్సో చట్టంలోని సెక్షన్-6 కింద దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా, ఘటన సమయంలో బాధితురాలి వయసు 18 ఏళ్ల కంటే తక్కువా లేదా అనేది కోర్టు మొదట విచారించింది.
Chhattisgarh HC on Pocso Case : సాక్ష్యాల లోపం - స్కూల్ టీచర్ వాంగ్మూలం
బాధితురాలి వయసును నిరూపించడానికి ప్రాసిక్యూషన్ ఆమె 8వ తరగతి మార్క్షీట్, స్కూల్ ప్రవేశ రికార్డులను సాక్ష్యంగా చూపించింది. అయితే విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. క్రాస్-ఎగ్జామినేషన్లో పాఠశాల సహాయ ఉపాధ్యాయుడు మాట్లాడుతూ, ఆ పుట్టిన తేదీని తాను స్వయంగా నమోదు చేయలేదని, ఏ ఆధారాలు లేదా పత్రాల ప్రకారం ఆ తేదీని రికార్డుల్లో రాశారో తనకు తెలియదని కోర్టుకు తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులకు కూడా ఆమె ఖచ్చితమైన పుట్టిన తేదీ తెలియదని, వయసు సుమారు 14 ఏళ్లు ఉంటుందని మాత్రమే వారు వెల్లడించారని కోర్టు గుర్తించింది. బదిలీ సర్టిఫికెట్ లేదా రికార్డులకు మద్దతుగా అధికారిక జనన ధ్రువీకరణ పత్రాన్ని (Birth Certificate) ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన పలు పూర్వ తీర్పులను ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రస్తావించింది. ఒక పత్రాన్ని కోర్టు సాక్ష్యంగా స్వీకరించినంత మాత్రాన, అందులో నమోదు చేసిన ప్రతీ అంశం నిబంధనలకు కట్టుబడి వాస్తవమే అవుతుందని భావించలేమని వ్యాఖ్యానించింది. బాధితురాలు మైనర్ అని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని స్పష్టం చేస్తూ నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.
సీఎన్జీ ఇంధనం నింపే పైపు పగిలి పెట్రోల్ పంపు కార్మికుడు మృతి

