Kakinada Crime: ప్రేమ పేరుతో తనను మోసం చేసి, బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి భర్త తీవ్ర వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఎస్పీ కార్యాలయ ఆవరణలోనే ఆమె తన తల్లితో బొట్టు పెట్టించుకుని, తిరిగి హిందూ మతంలోకి వస్తున్నట్లు ప్రకటించడం స్థానికంగా కలకలం సృష్టించింది.
Read Also :Papannapet School: గురువే..గుండెల్లోగుబులు పుట్టించాడా..?
ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఆపై నరకం
కాకినాడ జగన్నాథపురానికి చెందిన సిరివూరి బాలరమ్య, డిగ్రీ చదువుతున్న రోజుల్లో మటన్ షాపు నడిపే గౌస్ మొహిద్దీన్తో ప్రేమలో పడింది. ఎనిమిదేళ్ల క్రితం తల్లిదండ్రులను ఎదిరించి అతడిని వివాహం చేసుకుంది. పెళ్లయిన రెండు నెలలకే వేధింపులు ప్రారంభమయ్యాయని, తనను బలవంతంగా ఇస్లాంలోకి మార్చి ‘షేక్ ఉమల్ ఖైర్’గా పేరు మార్చారని బాధితురాలు వాపోయింది. పాప జన్మించిన తర్వాత వేధింపులు మితిమీరాయని, తన ముందే మరో ఐదారుగురు హిందూ యువతులతో సహజీవనం చేస్తూ వారిని కూడా మతం మార్చాడని ఆరోపించింది. దీనిపై నిలదీస్తే ఏడుగురిని పెళ్లి చేసుకునే హక్కు తనకు ఉందంటూ కత్తులతో బెదిరించి దాడి చేసేవాడని కన్నీరు మున్నీరైంది.
Kakinada Crime: రౌడీషీటర్ భర్తపై చర్యలకు బీజేపీ నేతలతో కలిసి విజ్ఞప్తి
గతంలో ఓ యువతిని కత్తితో గాయపరిచిన కేసులో గౌస్ మొహిద్దీన్పై రౌడీషీట్ నమోదైందని, ప్రస్తుతం ఒక ఎస్సీ మహిళను వేధించిన కేసులో అతడు రిమాండ్లో ఉన్నాడని బాలరమ్య తెలిపింది. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్కుమార్తో కలిసి జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కలిసిన బాధితురాలు, తనకు రక్షణ కల్పించి భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటువంటి బలవంతపు మతమార్పిడులు, వేధింపులపై సమగ్ర విచారణ జరిపించాలని ఈ సందర్భంగా రామ్కుమార్ డిమాండ్ చేశారు.

