Sunitha Krishnan : ఊపిరితిత్తుల క్యాన్సర్తో పోరాడుతున్న ప్రముఖ సామాజిక వేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్కు తెలంగాణ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కొండంత అండగా నిలిచారు.
ఆమె వైద్య చికిత్స, ఖరీదైన మందుల వ్యయం కోసం ప్రభుత్వం తరఫున అవసరమైన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రభుత్వ స్పందనపై సంతోషం వ్యక్తం చేస్తూ సునీతా కృష్ణన్ సామాజిక మాధ్యమం వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. లభించిన ఈ మద్దతు తనలో కొత్త ఆశను నింపిందని, త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుని మానవ అక్రమ రవాణాపై తన సామాజిక పోరాటాన్ని, మిషన్ను మరింత పట్టుదలతో కొనసాగిస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

నూతన శక్తితో సేవలు అందించాలని సీఎం ఆకాంక్ష
సునీతా కృష్ణన్ తెలిపిన ధన్యవాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ఆమె త్వరగా పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకుని రాబోయే రోజుల్లో నూతన ఉత్సాహంతో, రెట్టింపు శక్తితో సమాజ సేవలో పునరంకితం కావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ‘ప్రజ్వల’ సంస్థ ద్వారా సునీతా కృష్ణన్ సెక్స్ ట్రాఫికింగ్ బాధితులైన వేలాది మంది మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడంతో పాటు పునరావాసం కల్పిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. సమాజానికి ఆమె అందిస్తున్న అసమాన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతున్న వేళ ఆమెకు ప్రభుత్వం తక్షణ లబ్ధి చేకూర్చడం పట్ల పలువురు పౌర సమాజ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

