Ponguleti Srinivas Reddy: తెలంగాణలోని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ విభాగాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్డీవో, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆధునిక హంగులతో కూడిన శాశ్వత ప్రభుత్వ భవనాలను నిర్మించనున్నట్లు రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాలను ప్రకటించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, గౌరవప్రదమైన వాతావరణంలో ప్రభుత్వ సేవలు అందించడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
Telangana Revenue
read also: CP Sajjanar: రూ. 5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
తొలి దశలో 125 తహసీల్దార్, 11 ఆర్డీవో ఆఫీసులు
మొదటి విడత కింద రాష్ట్రంలో శిథిలావస్థలో ఉన్న, అద్దె ప్రాంగణాల్లో నడుస్తున్న 125 తహసీల్దార్ కార్యాలయాలతో పాటు 11 ఆర్డీవో (RDO) ఆఫీసులకు ఒకే తరహా (యూనిఫాం మోడల్) నమూనాతో కొత్త భవనాలను నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ భవనాల తుది డిజైన్లను ఖరారు చేస్తామని మంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాల గుర్తింపు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Ponguleti Srinivas Reddy: ORR పరిధిలో 12 మోడరన్ క్లస్టర్లు
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రజల సౌకర్యార్థం 12 ప్రత్యేక క్లస్టర్లుగా వర్గీకరించనున్నారు. ఈ క్లస్టర్లలో అత్యాధునిక సమీకృత భవన సముదాయాలను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గచ్చిబౌలి, మేడ్చల్, పటాన్చెరు, కోహెడ ప్రాంతాలలో నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయని మంత్రి వివరించారు.
పాలనా సంస్కరణలు.. ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష
గత ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే మండలాల పునర్విభజన చేసిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక కొత్త మండలాలకు అవసరమైన పోస్టులను భర్తీ చేసి పాలనా యంత్రాంగాన్ని బలోపేతం చేశామని గుర్తుచేశారు. వీటితో పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ నిర్మాణానికి సంబంధించి అర్హులైన పేదలకు ఇచ్చేందుకు స్థలాల గుర్తింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
విద్యార్థులకు అలర్ట్: చదువు మధ్యలో మానేస్తే స్కాలర్షిప్ వెనక్కివ్వాల్సిందే

