Uttar Pradesh Pension fraud: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మానవ సంబంధాలకు మచ్చ తెచ్చేలా ఒక విస్తుపోయే మోసం వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి ఏడేళ్ల క్రితమే మరణించినా, ఆమె ఇంకా బతికే ఉందని నమ్మించి పెన్షన్ కాజేశాడు ఓ కొడుకు.
నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసిన ఈ ఘరానా మోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెళితే, మీరట్కు చెందిన శాంతి దేవి అనే మహిళ ఒక స్వాతంత్ర్య సమరయోధుడి భార్య. ఆమెకు ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్తో పాటు డిఫెన్స్ పెన్షన్ కూడా వచ్చేది. ఆమె 2018 డిసెంబర్ 9న మరణించారు. అయితే, ఆమె కుమారుడు ప్రేమ్ సింగ్ తన తల్లి మరణాన్ని అధికారులకు తెలపకుండా దాచిపెట్టాడు. ప్రతి ఏడాది బ్యాంకులో సమర్పించాల్సిన ‘లైఫ్ సర్టిఫికెట్’ (జీవించి ఉన్నట్లు ధృవీకరణ పత్రం)ను నకిలీ మార్గాల్లో సృష్టించి, ఏడేళ్ల పాటు పెన్షన్ పొందుతూనే ఉన్నాడు.
Pension fraud using dead mothers name
Uttar Pradesh Pension fraud: బ్యాంకు ఖాతా నుంచి రూ. 44 లక్షల విత్డ్రా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సకౌటి తాండా బ్రాంచ్లో ఉన్న తన తల్లి ఖాతాను ప్రేమ్ సింగ్ తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఏటీఎం కార్డులు, యూపీఐ (UPI) ద్వారా ఏడేళ్ల కాలంలో మొత్తం రూ. 44,38,096 రూపాయలను డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు. 2025 అక్టోబర్లో ఒక వ్యక్తి సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు రట్టయింది. బ్యాంకు అధికారులు అంతర్గత విచారణ జరపగా, 2018 నుంచే శాంతి దేవి మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.
కోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు
బ్యాంకు మేనేజర్ తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో, ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీవ్రంగా స్పందిస్తూ నిందితుడిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. బుధవారం దౌరాలా పోలీసులు ప్రేమ్ సింగ్తో పాటు అతనికి సహకరించిన ఇతర వ్యక్తులపై ఫోర్జరీ, మోసం, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పత్రాల ధృవీకరణ పూర్తయిన తర్వాత నిందితులను అరెస్ట్ చేస్తామని ఇన్స్పెక్టర్ సుమన్ కుమార్ సింగ్ తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఏప్రిల్ 1 నుండి రష్యా గ్యాసోలిన్ ఎగుమతులపై నిషేధం: గ్లోబల్ మార్కెట్లో కలకలం

