తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సామాజిక నిర్ణయం తీసుకుంది. అత్యంత వెనుకబడిన కులాల (Most Backward Classes - MBC) జాబితాలో కొత్తగా 14 కులాలను చేర్చేందుకు నిర్ణయించింది.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 లక్షల మందికి ప్రభుత్వ పథకాల ద్వారా ప్రత్యక్ష లాభం చేకూరనుంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

ఎంబీసీ లిస్టులో కులాల సంఖ్య 50కి చేరిక
ప్రస్తుతం తెలంగాణలో() ఎంబీసీ జాబితాలో 36 కులాలు ఉన్నాయి. తాజాగా మరో 14 కులాలను కలపడంతో మొత్తం సంఖ్య 50కి చేరనుంది. కేంద్రం ఆమోదం తెలిపిన అనంతరం, డీ-నోటిఫైడ్ ట్రైబ్స్ (DNT) కేటగిరీలోకి వచ్చే ఎంబీసీలకు ప్రత్యేక సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.
కొత్తగా ఎంబీసీ జాబితాలో చేరనున్న కులాలు
- ఫకీర్
- గుడ్డి ఏలుగు
- సిక్లింగర్
- సిద్ధుల
- దాసరి
- జంగం
- చుండువాళ్లు
- బుక్క అయ్యావారాస్
- రాజానాల
- వాల్మికి బోయ
- పంబాల
- తల్యారీ
- యాట
- కునపులి
కులాల నుంచి వచ్చిన డిమాండ్లపై ప్రభుత్వ స్పందన
తమను కూడా ఎంబీసీ జాబితాలో చేర్చాలంటూ ఆయా కులాల నుంచి ప్రభుత్వానికి వినతులు అందాయి. వీటిని సమగ్రంగా పరిశీలించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, సామాజిక న్యాయం దృష్ట్యా ఈ 14 కులాలను ఎంబీసీ జాబితాలో చేర్చాలని కేంద్రానికి లేఖ రాసింది. ఇటీవల కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ రాష్ట్రాల నుంచి ఎంబీసీ జాబితా పంపించాలని కోరడంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది.
ఎంబీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి
ఎంబీసీ జాబితాలో ఉన్నవారికి కేంద్రం, రాష్ట్రం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'Scheme for Economic Empowerment of DNTs' ద్వారా విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, స్వయం ఉపాధి రంగాల్లో ఆర్థిక సహాయం అందుతుంది.
ఈ పథకాల ద్వారా
- సొంత ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం
- విద్యార్థులకు ఉచిత కోచింగ్
- స్వయం ఉపాధికి తక్కువ వడ్డీతో రుణాలు
- కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సదుపాయాలు
అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఎంబీసీ జాబితాలో లేకపోవడంతో ఈ ప్రయోజనాలకు దూరమైన సంచార జాతులు, పేద వర్గాలకు ఇకపై న్యాయం జరగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Breaking News: Nampally Fire Accident: నాంపల్లి ఘటన..ఐదు మృతదేహాల గుర్తింపు

