AP TG Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మునుపెన్నడూ లేని విధంగా అత్యంత విచిత్రంగా మారింది. ఒకవైపు భానుడి భగభగలతో జనాలు అల్లాడిపోతుంటే..
మరోవైపు అకస్మాత్తుగా కురుస్తున్న అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తర తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం, దక్షిణ తెలంగాణ వరకు విస్తరించిన బలమైన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఓ వైపు కొన్ని జిల్లాల్లో 46 డిగ్రీల దాకా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ముప్పు పొంచి ఉండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
Heavy Rains Telugu States
ఆంధ్రప్రదేశ్లో వడదెబ్బకు ఇద్దరు బలి.. నేడు ఈ జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 41.8 డిగ్రీలు, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం కూనవరంలో 41.6 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలో 41.5 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, శ్రీకాకుళం జిల్లాలో వడదెబ్బ తీవ్రతకు గురై పలాసపురానికి చెందిన సింహాచలం పాణిగ్రహి (68), రంగనాథపురానికి చెందిన నడిపూడి కృష్ణారావు (36) అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Read also: Govt Schools : ప్రభుత్వ స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఎండలు మరింత ముదిరి 45 నుండి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' జారీ చేసింది.
మరోవైపు ద్రోణి ప్రభావంతో బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు.
AP TG Weather Report: తెలంగాణలో చల్లబడ్డ వాతావరణం.. ధాన్యం తడిసి రైతన్నల కన్నీరు
తెలంగాణలోనూ ఇటువంటి ద్వంద్వ వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు దంచికొట్టాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బుధవారం కూడా ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీయడంతో నగరవాసులకు ఎండల నుండి పెద్ద ఉపశమనం లభించింది.
అయితే, ఈ అకాల వర్షాలు రాష్ట్రంలోని రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఐకేపీ సెంటర్లు, మార్కెట్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉంచిన వరి ధాన్యం భారీ వర్షాలకు తడిసి ముద్దవడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. గురువారం కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త అదుపులోనే ఉంటాయని, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
నేడు మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

