Strait of Hormuz: అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి' (Strait of Hormuz) సుదీర్ఘకాలంగా మూతపడటంతో ప్రపంచ సముద్ర రవాణా రంగం మునుపెన్నడూ లేని విధంగా స్తంభించిపోయింది.
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సుమారు 125 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 10.4 లక్షల కోట్లు) విలువైన సరుకుతో ఉన్న 1,200 కంటే ఎక్కువ కార్గో నౌకలు నిలిచిపోయినట్లు షిప్పింగ్ డేటా మరియు బీమా సంస్థల నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే అంతర్జాతీయ జలమార్గం గుండా రవాణా నిలిచిపోవడానికి ప్రధాన కారణం.
Global Trade Crisis
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG)లో ఐదో వంతు భాగం ఈ ఇరుకైన జలసంధి గుండానే రవాణా అవుతుంది. ఫిబ్రవరి 2026 ఆఖర్లో ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడులతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. జూన్ మధ్యలో ఇరుపక్షాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ఇరాన్ చేసిన తాజా ప్రకటనలు సముద్ర మార్గంలో మళ్లీ ఆందోళనలను పెంచాయి.
read also:Donald Trump: ఇరాన్పై సైనిక చర్యలు ఆపాలని ట్రంప్ను ఆదేశించిన సెనేట్
నౌకల దిగ్బంధం.. మానవీయ సంక్షోభంలో 20,000 మంది నావికులు
అలియాంజ్ కమర్షియల్ సేఫ్టీ అండ్ షిప్పింగ్ తాజా నివేదిక ప్రకారం.. దాదాపు 29 మిలియన్ గ్రాస్ టన్నుల బరువు మోసుకెళ్తున్న 1,150 నుంచి 1,200 నౌకలు సముద్రంలోనే ఆగిపోయాయి. వీటితో పాటు దాదాపు 20,000 మంది నావికులు నెలల తరబడి నడిసముద్రంలోనే చిక్కుకుపోయి తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ మానవీయ సంక్షోభాన్ని నివారించేందుకు ఒమన్ దేశం చొరవ తీసుకుని ఒక ప్రత్యేక సేఫ్ కారిడార్ ద్వారా సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. కాగా, ఈ ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు జరిగిన దాడుల్లో 40కి పైగా నౌకలు దెబ్బతినగా, 14 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు.
Strait of Hormuz: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ
హర్మూజ్ జలసంధి మూసివేత ప్రభావం ప్రపంచ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇంధన కొరత భయాలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటేశాయి. నౌకలను ఆఫ్రికా ఖండం చుట్టూ సుదీర్ఘ మార్గంలో మళ్లించాల్సి రావడం లేదా ప్రత్యామ్నాయ భూమార్గాలను ఎంచుకోవడం వల్ల రవాణా వ్యయం భారంగా మారింది. సుమారు 3 లక్షల కంటైనర్ల కార్గో అక్కడే నిలిచిపోవడంతో ప్రాంతీయ ఓడరేవులపై ఒత్తిడి పెరిగింది. ఉష్ణోగ్రతలకు దెబ్బతినే వస్తువులు, త్వరగా పాడైపోయే ఆహార పదార్థాల నష్టం కారణంగా బీమా క్లెయిమ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా అనిశ్చితి.. ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చ
జూన్ చివరి వారంలో గల్ఫ్ ప్రాంతం నుండి కొన్ని నౌకల రాకపోకలు మొదలైనట్లు షిప్పింగ్ డేటా చూపిస్తోంది. అయితే, లెబనాన్ పరిణామాలను అడ్డం పెట్టుకుని ఈ మార్గాన్ని మళ్లీ మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతానికి కొన్ని నౌకలు ప్రయాణిస్తున్నాయని అమెరికా అధికారులు చెప్తున్నప్పటికీ, పూర్తిస్థాయి భద్రతపై నమ్మకం కలగడం లేదు. హర్మూజ్, సూయజ్ కాలువ వంటి సాంప్రదాయ జలమార్గాలపైనే పూర్తిగా ఆధారపడకుండా సరికొత్త ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అత్యవసర పరిస్థితిని ఈ సంక్షోభం ప్రపంచ దేశాలకు గుర్తుచేస్తోంది.
read also:

