TTD Updates:తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు సాలకట్ల జ్యేష్టాభిషేకం అత్యంత వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో ఈ విశేష ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ.
తరతరాలుగా అభిషేకాలు నిర్వహించడం వల్ల ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా, వారి కళాకాంతులు తగ్గకుండా ఉండేందుకు ఈ క్రతువును చేపడతారు. ఈ ప్రత్యేక ఉత్సవాన్ని అభిద్యేయక అభిషేకం అని కూడా పిలుస్తారు.
Thirumala Jyeshthabhishekam 2026
మూడు రోజుల ప్రత్యేక పూజా కార్యక్రమాలు
ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీ మలయప్పస్వామి వారికి ఉన్న బంగారు కవచాన్ని తొలగిస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా హోమాలు, పంచామృతాలతో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మొదటి రోజు రాత్రి స్వామి వారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండో రోజు ముత్యాల కవచాన్ని సమర్పించి పూజలు చేస్తారు. మూడో రోజు తిరుమంజనాదులు పూర్తి చేసిన తర్వాత, తిరిగి బంగారు కవచాన్ని స్వామి వారికి అలంకరిస్తారు. ఈ బంగారు కవచాన్ని వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం వరకు తీయరు.
TTD Updates:రద్దు చేయబడిన ఆర్జిత సేవలు
ఈ జ్యేష్టాభిషేక వేడుకలను పురస్కరించుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్సవాల్లో చివరి రోజైన జూన్ 28న పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ రోజున జరగాల్సిన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు నిలిపివేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, తమ దర్శన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించడం జరిగింది.
Epaper: epaper.vaartha.com

