Dailyhunt
తిరుమలలో పారిశుద్ధ్యానికి టీటీడీ పెద్దపీట

తిరుమలలో పారిశుద్ధ్యానికి టీటీడీ పెద్దపీట

వార్త 1 week ago

భక్తులకు నిరంతరాయంగా నాణ్యమైన పారిశుద్ధ్య సేవలు

మొబైల్ వాటర్ ట్యాంకులతో శ్రీవారి సేవకుల ద్వారా తాగునీరు పంపిణీ

టీటీడీ ఏర్పాట్లపై భక్తుల్లో సంతృప్తి

Read Also: YS Sharmila Comments : జగన్‌పై షర్మిల తీవ్ర విమర్శలు

Tirumala: తిరుమలలో భక్తుల ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు టీటీడీ పెద్ద పీట వేస్తోంది. రోజుకు సగటున 80 వేల నుండి 1 లక్ష మంది భక్తులు సందర్శిస్తున్న నేపథ్యంలో సుమారు 4.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ సమర్థంగా కొనసాగుతోంది.

పారిశుద్ధ్య నిర్వహణ విధానం

పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడానికి తిరుమల ప్రాంతాన్ని మూడు జోన్లుగా, ఏడు వార్డులుగా విభజించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే డి&ఓ ట్రేడ్ లైసెన్సులను నియంత్రించి నో స్టాక్ - నో గోడౌన్ లైసెన్సులను జారీ చేయడం జరుగుతోంది. వార్డు-1లో శ్రీవారి ఆలయం పరిధిలో విభాగ సిబ్బంది ప్రత్యక్షంగా పనిచేస్తుండగా, వార్డు-2 నుండి 7 వరకు పారిశుద్ధ్య పనులు మూడు కాంట్రాక్ట్ సంస్థల ద్వారా నిర్వహిస్తున్నారు.

సమర్థవంతంగా చెత్త సేకరణ

తిరుమలలో చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించేందుకు 9 టిప్పర్ వాహనాలు పనిచేస్తున్నాయి. రోజుకు సుమారు 45 ట్రిప్పులు చేసి, సుమారు 3,056 చెత్త బిన్స్ నుండి చెత్త సేకరణ జరుగుతోంది. అన్ని వాహనాలు కలిపి రోజుకు సుమారు 400 కిలోమీటర్ల మేరా ప్రయాణిస్తున్నాయి.

2025 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు

బయోడిగ్రేడబుల్ వ్యర్థాలు: 16,689.04 మెట్రిక్ టన్నులు.
నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలు: 8,221.97 మెట్రిక్ టన్నులు.
మొత్తం వ్యర్థాలు: 24,911.01 మెట్రిక్ టన్నులు.

మరుగుదొడ్ల సదుపాయాలు

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వార్డు వారీగా విస్తృతంగా మరుగుదొడ్ల బ్లాకులు ఏర్పాటు చేశారు.

మొత్తం శాశ్వత టాయిలెట్ బ్లాకులు: 210.
సంస్థల టాయిలెట్లు: 130.
తాత్కాలిక టాయిలెట్లు: 14.
మొత్తం టాయిలెట్ బ్లాకులు: 354.

మొబైల్ వాటర్ డ్రమ్స్ తో శ్రీవారి సేవకుల ద్వారా తాగునీరు పంపిణీ

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండే పలు ప్రాంతాల్లో మొబైల్ వాటర్ డ్రమ్స్ ద్వారా శ్రీవారి సేవకులతో తాగునీరు పంపిణీ చేయడం జరుగుతోంది. వేసవి ప్రారంభమవ్వడంతో భక్తులు తాగునీటికి ఇబ్బంది పడకుండా నేరుగా భక్తుల వద్దకే శ్రీవారి సేవకులు వెళ్లి తాగునీరు అందిస్తున్నారు.

నీరు, ఆహార నాణ్యత పర్యవేక్షణ

టీటీడీ నీరు, ఆహార విశ్లేషణ ప్రయోగశాల 1981లో స్థాపించబడింది. ప్రస్తుతం NABL గుర్తింపు పొందిన ఈ ల్యాబ్ భక్తులకు అందించే నీరు, ఆహారం నాణ్యతను కఠినంగా పరీక్షిస్తోంది. ప్రతిరోజూ లడ్డూ, అన్నప్రసాదం తయారీలో ఉపయోగించే పదార్థాల పరీక్షలు, నీటి నమూనాల విశ్లేషణ (రోజుకు సుమారు 20 నమూనాలు), నెలకు 1000-1200 నమూనాల పరీక్షలు, నెయ్యి నాణ్యత పరీక్షలకు ఆధునిక HPLC, GC యంత్రాలు వినియోగంలో ఉన్నాయి.

కొత్త ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు

భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ద్వారా ఇటీవల రూ.19.75 కోట్లతో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు జరిగింది. ఇందులో LC-MS/MS, GC-MS/MS, ICP-MS/MS వంటి ఆధునిక సాంకేతిక పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది.

నాణ్యమైన పారిశుద్ధ్య సేవలపై భక్తుల్లో సంతృప్తి

తిరుమలలో టీటీడీ ఆరోగ్య విభాగం అందిస్తున్న నాణ్యమైన పారిశుద్ధ్య సేవలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా టీటీడీ ఎప్పటికప్పుడు చెత్తను సేకరిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టడం, మరుగుదొడ్లను అనునిత్యం పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యలపై భక్తులు టీటీడీని ప్రశంసిస్తున్నారు.

తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, తిరుమలలో పారిశుద్ధ్య, చెత్త నిర్వహణ, మరుగుదొడ్ల సదుపాయాలు, ఆహార భద్రతను టీటీడీ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి, భక్తులకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా టీటీడీ పని చేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కోనసీమపై పవన్ కళ్యాణ్ వరాల జల్లు.. రూ. 30 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha