Tirupati Mobile Phone Recovery: తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరోసారి భారీ విజయాన్ని అందుకుంది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న, చోరీకి గురైన సుమారు రూ.
కోటి విలువైన 500 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. 14వ దశ మొబైల్ రికవరీ (14th Phase Mobile Recovery) కార్యక్రమంలో భాగంగా స్వాధీనం చేసుకున్న ఈ ఫోన్లను తిరుపతి జిల్లా ఎస్పీ (SP) సుబ్బరాయుడు మంగళవారం బాధితులకు అధికారికంగా అందజేశారు.
ఇతర రాష్ట్రాల నుండి కూడా మొబైల్స్ రికవరీ
ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. తిరుపతి జిల్లా పరిధిలోనే కాకుండా, దొంగతనానికి గురై దేశంలోని వివిధ ఇతర రాష్ట్రాలకు చేరిన మొబైల్ ఫోన్లను కూడా సైబర్ క్రైమ్ విభాగం అత్యాధునిక సాంకేతికతతో ట్రాక్ చేసిందని వెల్లడించారు. క్లిష్టమైన ఆపరేషన్ల ద్వారా పొరుగు రాష్ట్రాల నుండి సైతం ఈ 500 ఫోన్లను రికవరీ చేసి, వాటి అసలైన యజమానులకు తిరిగి అప్పగించడం ద్వారా బాధితుల ముఖాల్లో ఆనందాన్ని నింపగలిగామని ఆయన పేర్కొన్నారు.
Tirupati Mobile Phone Recovery: సీఈఐఆర్ (CEIR) పోర్టల్పై ఎస్పీ కీలక సూచన
మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఆందోళన చెందకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీఈఐఆర్ పోర్టల్ (Central Equipment Identity Register) లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. ఈ పోర్టల్లో ఐఎంఈఐ (IMEI) నంబర్ బ్లాక్ చేయడం ద్వారా ఫోన్ దుర్వినియోగం కాకుండా ఆపవచ్చని, అలాగే పోలీసులకు దాన్ని సులువుగా ట్రాక్ చేసే వెసులుబాటు కలుగుతుందని వివరించారు.
ఈ భారీ రికవరీ ఆపరేషన్లో రాత్రింబవళ్లు శ్రమించి, అధునాతన లొకేషన్ ట్రాకింగ్ ద్వారా విశేష ప్రతిభ కనబరిచిన జిల్లా సైబర్ క్రైమ్ విభాగం ఇన్స్పెక్టర్, ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

