Trimbakeshwar temple: మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకేశ్వర ఆలయ సముదాయంలో ఒక అరుదైన, భక్తిపూర్వక ఘటన చోటుచేసుకుంది.
ఆలయ ప్రాంగణంలోని చారిత్రాత్మక ‘అమృతకుండం’లో ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక శివలింగం వెలుగులోకి వచ్చింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు, ఆలయ అర్చకులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.
భారత పురావస్తు శాఖ (ASI) ఆధ్వర్యంలో ఆలయ పరిరక్షణ, పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సుమారు 65 అడుగుల లోతు ఉన్న అమృతకుండంలో పేరుకుపోయిన పూడికను, నీటిని పూర్తిగా తొలగించారు. కుండం అడుగు భాగం వరకు నీటిని తోడేసిన తర్వాత, అక్కడ ఎన్నో ఏళ్లుగా నిగూఢంగా ఉన్న శివలింగం స్పష్టంగా దర్శనమిచ్చింది.

Trimbakeshwar temple: పేష్వాల కాలం నాటి చరిత్ర
ఈ అమృతకుండానికి ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. పేష్వాల కాలం నాటి ఈ కుండంలోని పవిత్ర జలాన్నే ప్రతిరోజూ త్రయంబకేశ్వరుని పూజా కార్యక్రమాలకు, అభిషేకాలకు ఆలయ పూజారులు ఉపయోగిస్తారు. ఎన్నో ఏళ్లుగా నీటితో నిండి ఉండటం వల్ల ఈ శివలింగం ఎవరి కంటికీ కనబడలేదు. అమృతకుండంలో శివలింగం బయటపడిన వార్త తెలియడంతో ఆలయ పరిసరాల్లో భక్తిభావం వెల్లివిరిసింది. అయితే, ప్రస్తుతం అక్కడ పురావస్తు శాఖ పనులు ఇంకా కొనసాగుతుండటం, అలాగే భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అమృతకుండం వైపునకు భక్తులు వెళ్లకుండా ప్రస్తుతం తాత్కాలికంగా నిషేధం విధించారు. పనులు పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
జైపూర్ పారామెడికల్ పరీక్షలో పాస్ చేయించేందుకు రూ.5.5 లక్షల డీల్.. నలుగురు అరెస్ట్

