SIR : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ముగిసి, ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఈ సుదీర్ఘ పరిశీలనలో దాదాపు 3 లక్షల ఓట్లు తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఖమ్మం జిల్లాలో మొత్తం 12.43 లక్షల మంది ఓటర్లకు గాను 10.85 లక్షల మంది ఎన్యూమరేషన్ పత్రాలు మాత్రమే డిజిటలైజ్ కాగా, 1.58 లక్షల మంది ఓటర్లు తగ్గారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9.96 లక్షల ఓటర్లలో 8.63 లక్షల పత్రాలు నమోదు కాగా, మరో 1.32 లక్షల మంది వివరాలను అధికారులు సేకరించలేకపోయారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, బోగస్ ఓట్లకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు.
SIR Enumeration అన్ కలెక్టబుల్ ఓటర్ల జాబితా: ఈ నెల 17న ముసాయిదా ప్రచురణ
సేకరించలేని విధంగా ఉన్న ఈ 2.90 లక్షల ఓటర్ల జాబితాలో ప్రధానంగా మరణించినవారు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లినవారు, ఒకటికి మించి ఉన్న డబుల్ ఓటర్లు మరియు అధికారుల సర్వే సమయంలో అందుబాటులో లేనివారు ఉన్నారు. క్షేత్రస్థాయిలో బిఎల్ఓ (BLO)లు ఇంటింటికీ తిరిగి నిర్వహించిన పారదర్శకమైన పరిశీలన వల్లే ఈ భారీ మార్పులు వెలుగులోకి వచ్చాయి. ప్రక్రియ తుది దశకు చేరడంతో, బాధ్యుల పరిశీలన నిమిత్తం ఈ నెల 17వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను (Draft Voter List) అధికారులు అధికారికంగా విడుదల చేయనున్నారు. అనంతరం అభ్యంతరాలు, సవరణలకు అవకాశం కల్పించనున్నారు.

