YSRCP: విజయనగరం రింగ్ రోడ్డులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గౌరవ విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించబడిన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం 33 సంవత్సరాల లీజు ప్రాతిపదికన కేటాయించిందని స్పష్టం చేశారు. 2022 జూన్ 6న ప్రభుత్వం అధికారికంగా స్థలాన్ని కేటాయించగా, అనంతరం సంబంధిత శాఖల అనుమతులతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అన్ని నిర్మాణ అనుమతులు పొందిన తర్వాతే పార్టీ కార్యాలయ భవన నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేశామని తెలిపారు.

ప్రస్తుతం పార్టీ కార్యాలయం ఉన్న స్థలం ప్రైవేట్ వ్యక్తులకు చెందినదంటూ కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ఆయన పేర్కొన్నారు. చట్టబద్ధమైన అన్ని అనుమతులతో నిర్మించిన భవనంపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. భవనం నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని వారు, ఇప్పుడు ఆకస్మికంగా వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని విమర్శించారు.
YSRCP: అలాగే మాజీ మంత్రి శ్రీ అశోక్ గజపతిరాజు గారు ఈ స్థలం ప్రైవేటు వ్యక్తులకు చెందినదని ఫిర్యాదు చేశారంటూ వస్తున్న ప్రచారం కూడా ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నమేనని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయడం బాధ్యతాయుతమైన రాజకీయాలకు తగదని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే నిర్మించబడిందని, దీనిపై అసత్య ప్రచారాలు మానుకుని వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని చిన్న శ్రీను గారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో.. వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడు బాబు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి గారు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జైహింద్ కుమార్ గారు, జిల్లా అధికార ప్రతినిధి కనకల రఘు రామ్ గారు పాల్గొన్నారు.
Epaper: epaper.vaartha.com
నెల్లూరులో వైభవంగా ప్రారంభమైన 'రొట్టెల పండుగ'.. రొట్టె స్వీకరించిన మంత్రి నారాయణ!

