Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసిపికి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు: శాప్ చైర్మన్ రవినాయుడు

వైసిపికి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు: శాప్ చైర్మన్ రవినాయుడు

వార్త 2 weeks ago

Ravi Naidu: గత అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఘోరంగా ఓడించారనే కక్షతోనే నిరుద్యోగ యువతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రతికారేచ్ఛతో వ్యవహరిస్తోందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఛైర్మన్ అనిమిని రవినాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపట్టిన డీఎస్సీ (AP DSC) నియామకాలపై కేవలం రాజకీయ స్వార్థంతోనే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తిరుపతిలో “నిరుద్యోగ యువతపై గొడ్డలివేటు” అనే పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సమావేశానికి కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన వెయ్యి మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.

 AP DSC political controversy

వైసీపీ చేస్తున్న కుట్రపూరిత ప్రచారం వల్ల రాత్రింబగళ్లు కష్టపడి ఉద్యోగాలు సాధించిన పేద అభ్యర్థులు, వారి కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారని రవినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. “రాజకీయాలు ఉంటే మాతో తేల్చుకోవాలి గానీ, ఇలా యువత జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం” అని హితవు పలికారు. ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయని జగన్ మోహన్ రెడ్డి, ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు తూతూమంత్రంగా నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 150 రోజుల్లోనే 15,941 మందికి ఉద్యోగ పత్రాలు అందించిందని, ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఏకంగా 150 కేసులు వేశారని ఆయన గుర్తుచేశారు.

Read also: AP DSC: డీఎస్సీ అక్రమాలకు ఆస్కారమే లేదు: కోన శశిధర్

స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం!

స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ వస్తున్న ఆరోపణలను రవినాయుడు పూర్తిగా కొట్టిపారేశారు. క్రీడాకారులకు సర్టిఫికెట్లు ఇచ్చేది ఆయా అసోసియేషన్లు, ఫెడరేషన్లేనని.. వాటిని అన్ని కోణాల్లో నిరూపించుకున్న తర్వాతే 427 పోస్టులను భర్తీ చేశామని స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా అత్యంత పారదర్శకంగా 3 శాతం స్పోర్ట్స్ కోటాను అమలు చేస్తుంటే, దానిపై కూడా బురద చల్లడం దారుణమన్నారు. తమ హయాంలో జరిగిన నియామకాలతో పాటు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై కూడా ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు.

Ravi Naidu: నిరుద్యోగుల ఆశలపై జగన్ విషం.. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆగ్రహం

ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కష్టపడి కొలువులు సాధించిన యువతకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిరుద్యోగులంతా ఏకమై జగన్ కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.

డ్రైవర్లతో గ్రూప్-1 పేపర్లు దిద్దించిన చరిత్ర మీది.. నిలదీసిన ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి

మరో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నేతలు అభ్యర్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత వైసీపీ పాలనలో గ్రూప్-1 ఆన్సర్ షీట్లను మంగళగిరి సమీపంలోని హాయ్ ల్యాండ్‌లో ఉంచి డ్రైవర్లు, పనివాళ్లతో దిద్దించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. “అలాంటి అప్రజాస్వామిక చరిత్ర ఉన్న వైసీపీకి, పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించిన కూటమి ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు ఉందా?” అని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారి వివరాలను అందరికీ తెలిసేలా పబ్లిక్ డొమైన్‌లో ఉంచామని, ఇందులో ఎక్కడైనా తప్పు జరిగినట్లు నిరూపిస్తే తాము బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధమని స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

జిందాల్ వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌లో పవన్ కల్యాణ్ పర్యటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha