Vinesh Phogat: భారత స్టార్ మహిళా రెజ్లర్, మూడుసార్లు ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన వినేశ్ ఫోగట్కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది.
2026 ఏషియన్ గేమ్స్ నిమిత్తం ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్న సెలక్షన్ ట్రయల్స్లో ఆమె పాల్గొనేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి, ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

Read also: IPL 2026 New Rules:ఫైనల్కు ముందు కొత్త రూల్స్ తీసుకొచ్చిన BCCI!
హైకోర్టు తీర్పును సవాలు చేసిన రెజ్లింగ్ సమాఖ్య
గత వారం ఢిల్లీ హైకోర్టు వినేశ్ ఫోగట్కు అనుకూలంగా తీర్పునిస్తూ ఆమెను ట్రయల్స్కు అనుమతించాలని పేర్కొంది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ “మాతృత్వం అనేది ఒక మహిళ కెరీర్కు లేదా వృత్తిపరమైన అవకాశాలకు అడ్డంకి కాబోదు” అని స్పష్టం చేసింది. అయితే, సమాఖ్య రూల్స్ ప్రకారం వినేశ్కు ట్రయల్స్లో పాల్గొనే అర్హత లేదని డబ్ల్యూఎఫ్ఐ వాదించింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసింది.
Vinesh Phogat: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
డబ్ల్యూఎఫ్ఐ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం వినేశ్ ఫోగట్ వైపు మొగ్గు చూపింది. “ఈ స్థానంలో మరెవరైనా సాధారణ అభ్యర్థి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ, వినేశ్ ఫోగట్ భారతదేశం గర్వించదగ్గ ఛాంపియన్ క్రీడాకారిణి” అని కోర్టు కొనియాడింది. హైకోర్టు తీర్పు తర్వాత ఆమెలో ఆశలు, నమ్మకం పెరిగాయని, ఈ చివరి నిమిషంలో కోర్టులు ఏమీ చేయలేవని చెప్పి ఆమెను వెనక్కి పంపడం సరికాదని డబ్ల్యూఎఫ్ఐ లాయర్కు ధర్మాసనం స్పష్టం చేసింది.
క్రీడా వ్యవహారాల్లో కోర్టుల జోక్యంపై అసహనం
వినేశ్కు తాత్కాలికంగా ట్రయల్స్ ఆడే అవకాశం కల్పించినప్పటికీ.. క్రీడలకు సంబంధించిన అంతర్గత విషయాల్లో హైకోర్టులు ఇంత వేగంగా జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. “ఇవేమీ మెడికల్ కాలేజీ సీట్ల కేటాయింపులు కావు.. ఇవి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్లు. కోర్టులు ప్రతి విషయానికి జోక్యం చేసుకుంటూ పోతే క్రీడా షెడ్యూల్ మొత్తం దెబ్బతింటుంది” అని జస్టిస్ నరసింహ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతానికి వినేశ్ను ట్రయల్స్లో పాల్గొనడానికి అనుమతించిన సుప్రీంకోర్టు, ఈ వివాదంపై పూర్తిస్థాయి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అలాగే, డబ్ల్యూఎఫ్ఐ వేసిన పిటిషన్కు సంబంధించి తన వివరణ ఇవ్వాల్సిందిగా వినేశ్ ఫోగట్ను కోర్టు ఆదేశించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

