Vietnam Boat Accident: వియత్నాం దేశంలో విహార యాత్రకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ పర్యాటకులు పడవ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.
ఆనందంగా గడపడానికి వెళ్లిన రాష్ట్ర పౌరులు ఇలా అకస్మాత్తుగా జలసమాధి కావడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ఈ కష్టకాలంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

read also: Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదంపై భారత ఎంబసీతో మాట్లాడిన నారా లోకేశ్
మొబైల్ కంపెనీ టూర్.. అసలేం జరిగిందంటే?
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒక ప్రముఖ మొబైల్ సంస్థ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మొత్తం 33 మంది సభ్యుల బృందం వియత్నాం పర్యటనకు వెళ్లింది. అక్కడ పడవ ప్రయాణం చేస్తున్న సమయంలో, వీరిలో 19 మంది ఉన్న ఒక బోటు హఠాత్తుగా ప్రమాదానికి గురైంది. ఈ దురదృష్టకర దుర్ఘటనలో ముగ్గురు పర్యాటకులు మరణించగా, అప్రమత్తమైన స్థానిక రక్షణ, సహాయక బృందాలు మిగిలిన 16 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి.
Vietnam Boat Accident: మృతుల గుర్తింపు.. కడప, మచిలీపట్నం, హిందూపురం వాసులు
ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసుల వివరాలను అధికారులు నిర్ధారించారు. మృతులలో కడప జిల్లాకు చెందిన ముడియం శ్రీధర్, మచిలీపట్నం నివాసి గెల్లి జయశ్రీ, మరియు అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన నల్లపేట రవితేజ ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురి మరణ వార్తలతో వారి స్వగ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
అధికారులకు సీఎం చంద్రబాబు అత్యవసర ఆదేశాలు
ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన మిగిలిన పర్యాటకులను వీలైనంత త్వరగా, సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని రకాల ప్రయాణ వసతులను కల్పించాలని ఆదేశించారు.
మృతుల కుటుంబాలతో నిరంతరం మాట్లాడుతూ, వారికి అవసరమైన మానసిక, ఆర్థిక సహాయాన్ని అందించాలని స్పష్టం చేశారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) మరియు అక్కడి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

