Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యాక్సెంచర్ దెబ్బకు భారీగా పతనమైన ఐటీ షేర్లు

యాక్సెంచర్ దెబ్బకు భారీగా పతనమైన ఐటీ షేర్లు

వార్త 2 weeks ago

Stock Market: గ్లోబల్ ఐటీ దిగ్గజం 'యాక్సెంచర్' ప్రకటించిన బలహీనమైన ఆదాయ అంచనాలు భారతీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. యాక్సెంచర్ నిరాశాజనక గైడెన్స్ కారణంగా శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ ఐటీ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి.

ఈ అమ్మకాల ఒత్తిడితో దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 608 పాయింట్లు నష్టపోయి 76,802 వద్ద స్థిరపడగా, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 155 పాయింట్లు పతనమై 24,013 స్థాయికి పడిపోయింది.

 Nifty IT Down

ఐటీ రంగంలో అమ్మకాల వెల్లువ.. ఇన్ఫోసిస్, టీసీఎస్ టాప్ లూజర్స్!

యాక్సెంచర్ సేల్స్ అంచనాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో భారత ఐటీ కంపెనీల భవిష్యత్ వృద్ధిపై ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. దీంతో ఐటీ షేర్లలో భారీగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. నిఫ్టీ, సెన్సెక్స్‌లలో ఇన్ఫోసిస్, టీసీఎస్ (TCS), టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ (HCL Tech) వంటి దిగ్గజ ఐటీ షేర్లు అత్యధికంగా నష్టపోయి టాప్ లూజర్లుగా నిలిచాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ భారీగా దెబ్బతిన్నది. ఐటీతో పాటు రియాల్టీ, ఆటోమొబైల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు నష్టపోగా.. ఫార్మా రంగం మాత్రం లాభాల్లో ముగిసి మార్కెట్‌కు కొంత ఉపశమనం కలిగించింది.

Stock Market: మిడ్ క్యాప్స్ జోష్.. నిఫ్టీకి కీలక మద్దతు ధరలు ఇవే!

ప్రధాన సూచీలు నష్టపోయినప్పటికీ, బ్రాడర్ మార్కెట్లు (Broader Markets) మాత్రం సానుకూల ట్రెండ్‌ను ప్రదర్శించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.22 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.42 శాతం మేర లాభాలను ఆర్జించాయి.

మార్కెట్ టెక్నికల్స్ ప్రకారం.. ప్రస్తుత తరుణంలో నిఫ్టీకి 24,100 నుండి 24,200 పాయింట్ల వద్ద తక్షణ నిరోధం (రెసిస్టెన్స్) ఎదురవుతోంది. ఈ స్థాయిని అధిగమిస్తే నిఫ్టీ 24,400 మార్కును తాకే అవకాశం ఉంది. అదే సమయంలో, కిందటి వైపు 23,900 స్థాయి అత్యంత కీలకమైన మద్దతు (సపోర్ట్) ధరగా పనిచేస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రూపాయి రికవరీ.. మార్కెట్ తదుపరి గమ్యం దేనిపై?

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గడం భారత కరెన్సీకి కలిసి వచ్చింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 7 పైసలు బలపడి 94.31 వద్ద ముగిసింది. రాబోయే రోజుల్లో దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల (FPIs) ప్రవాహం, నైరుతి రుతుపవనాల విస్తరణ, ముడి చమురు ధరలలో హెచ్చుతగ్గులు మరియు త్వరలో జరగబోయే రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) వంటి కీలక అంశాలు శాసిస్తాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

read also:

జియో IPOకి గ్రీన్ సిగ్నల్..ముకేశ్ అంబానీ కీలక ప్రకటన!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha