Chandrababu Naidu: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన 'యోగాంధ్ర-2026' కార్యక్రమ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
సచివాలయంలో జరిగిన ఈ భేటీలో సీఎం మాట్లాడుతూ, ‘ఇంటింటా యోగా’ నినాదంతో ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగం చేసుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ‘సంజీవని’ ఆరోగ్య పథకంతో అనుసంధానించాలని ఆయన సూచించారు.
International Yoga Day 2026
Read also: Pawan - Perni Nani : పవన్ తెలంగాణ పర్యటన పై పేర్ని నాని సెటైర్లు
ఏడాది కాలానికి సమగ్ర ప్రణాళిక
యోగాను కేవలం ఒక రోజుకే పరిమితం చేయకుండా, ఏడాది పొడవునా ప్రజలకు చేరువ చేసేలా ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి కోసం ప్రత్యేకంగా ‘థెరప్యూటిక్ యోగా’ (చికిత్సాత్మక యోగా) సెషన్లను నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 10 కోట్లు నిధులు మంజూరు చేసింది. కాగా, ఇప్పటివరకు దాదాపు కోటి మందికి పైగా ప్రజలు ఈ లీగ్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.33 లక్షల కేంద్రాల్లో ఈ యోగా వేడుకలు జరగనున్నాయి.
Chandrababu Naidu: విజయవాడలో రాష్ట్రస్థాయి వేడుకలు.. బాబా రామ్దేవ్ రాక
‘యోగాంధ్ర-2026’ రాష్ట్రస్థాయి ప్రధాన కార్యక్రమం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జరగనుంది. ఈ వేడుకలో సుమారు 5,000 నుండి 6,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ వాతావరణం అనుకూలించక వర్షం పడితే, ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ కళావేదికలో 1,000 మందితో కార్యక్రమం నిర్వహించేలా బ్యాకప్ ప్లాన్ సిద్ధం చేశారు.
ఈ ముఖ్యమైన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ కూడా పాల్గొనబోతున్నారు. బాబా రామ్దేవ్ జూన్ 19నే ఏపీకి చేరుకోనున్నారు. జూన్ 20న ఉండవల్లిలో ముఖ్యమంత్రితో కలిసి ఆయన ప్రత్యేక యోగా సెషన్లో పాల్గొంటారు.
మాస్టర్ ట్రైనర్లకు అవార్డులు.. ‘యోగా యాజ్ డెస్టినేషన్’ క్యాలెండర్
యోగాను విస్తృతంగా ప్రచారం చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచే యోగా మాస్టర్ ట్రైనర్లకు వచ్చే ఏడాది ప్రత్యేక అవార్డులు అందజేస్తామని సీఎం ప్రకటించారు. అలాగే, జూన్ 21న ‘యోగా యాజ్ డెస్టినేషన్’ క్యాలెండర్ను కూడా ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ చక్రధరబాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

