Passport Services: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నివసిస్తున్న భారతీయ పౌరులకు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం (Embassy) ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది.
పాస్పోర్ట్, వీసా, అటెస్టేషన్ (పత్రాల ధృవీకరణ) వంటి సాధారణ కాన్సులర్ సేవలు ఐదు రోజుల పాటు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. జూన్ 26వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని ఎంబసీ అధికారికంగా ప్రకటించింది.

Read also: PM Kisan: పీఎం కిసాన్ 23వ విడత నిధులు విడుదల
సేవల నిలిపివేతకు కారణం ఇదే
ఈ సేవల నిర్వహణ బాధ్యతలను కొత్తగా ఎంపిక చేసిన ఒక ఏజెన్సీకి అప్పగిస్తున్న నేపథ్యంలో, ఈ తాత్కాలిక మార్పులు చేపట్టినట్లు రాయబార కార్యాలయం వివరించింది. ప్రస్తుతం యూఏఈలో పాస్పోర్ట్, వీసా సేవలను పర్యవేక్షిస్తున్న ‘బీఎల్ఎస్ ఇంటర్నేషనల్’ (BLS International), అలాగే అటెస్టేషన్ సేవలను అందిస్తున్న ‘ఎస్జీఐవీఎస్ గ్లోబల్’ (SGIVS Global) సంస్థలు జూన్ 25వ తేదీతో తమ కార్యకలాపాలను ముగించుకోనున్నాయి.
Passport Services: జూలై 1 నుంచి కొత్త సంస్థ ఆధ్వర్యంలో సేవలు
జూలై 1వ తేదీ నుంచి ఈ సేవలన్నింటినీ కొత్తగా నియమితుడైన ‘అల్ హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎల్ఎల్సీ’ (Al Hind Tours and Travels LLC) సంస్థ నిర్వహించనుంది. యూఏఈ పరిధిలోని ఏడు ఎమిరేట్స్లలో మొత్తం 16 సేవా కేంద్రాల ద్వారా ఈ సరికొత్త సంస్థ తన కార్యకలాపాలను విస్తృతంగా సాగించనుంది.
అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలి?
కొత్త సంస్థకు బాధ్యతలు బదిలీ అయ్యే ఈ ఐదు రోజుల వ్యవధిలో ఎవరికైనా అత్యవసర కాన్సులర్ సేవలు అవసరమైతే, వారు నేరుగా అబుదాబిలోని భారత రాయబార కార్యాలయాన్ని లేదా దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
యూఏఈలో దాదాపు 35 లక్షల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే, అత్యవసర దరఖాస్తులు ఉన్నవారు జూన్ 25వ తేదీలోపే తమ అప్లికేషన్లను సమర్పించుకోవాలని అధికారులు సూచించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

