Tragedy : ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ పాత కాలం నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించిన తీవ్ర శోకసంద్రంలో నింపిన ఘోర ప్రమాదం జరిగింది.
ప్రతాప్గఢ్ నగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహూలీ వార్డులో గురువారం అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుండపోత వర్షాల కారణంగా దాదాపు 100 సంవత్సరాల క్రితం నాటి భవనం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో లోపల నిద్రిస్తున్న కుటుంబ సభ్యులందరూ శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు రెండు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాధితులను బయటకు తీశారు. ఆసుపత్రికి తరలించగా ఆరుగురు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించగా, మరొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తరాలవారు బలి: తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం యోగి
ఈ దారుణ ప్రమాదంలో నివాస గృహ యజమాని ప్రమోద్ శ్రీవాత్సవ (60), ఆయన భార్య రీతా శ్రీవాత్సవ (55), కుమారుడు నితిన్ (25), కోడలు మాధురి (23)లతో పాటు వారి చిన్నారి మనవళ్లు మాధవ్ (2), అద్విక్ (4 నెలలు) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీవాత్సవ మరో కుమారుడు అమన్ శ్రీవాత్సవ (28) తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక్క క్షణంలో కుటుంబం మొత్తం కంటికి రెప్పలా కనుమరుగవ్వడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ, గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని, బాధితుడికి 24 గంటల్లోగా ప్రభుత్వ పరంగా తగిన ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

