మంత్రి సీతక్క తెలంగాణ పీజీ లా సెట్ పరీక్షకు హాజరయ్యారు. రాజ్యాంగ చట్టంలో ఎల్ఎల్ఎం చేయాలన్న లక్ష్యంతో మరోసారి చదువుల బాట పట్టారు.
నక్సలైట్ జీవితం నుంచి రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఉన్నత చదవులు చదువాలన్న కోరికను కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మంత్రి సీతక్క మంగళవారం మౌలాలిలో జరిగిన తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్కు హాజరయ్యారు.
ఇప్పటికే ఎల్ఎల్బీ, కార్పొరేట్ లాలో ఎల్ఎల్ఎం, పొలిటికల్ సైన్స్లో పీహెచ్డి పూర్తి చేసిన మంత్రి, భారత రాజ్యాంగంపై తనకున్న ప్రగాఢమైన ఆసక్తితో ఇప్పుడు రాజ్యాంగ చట్టంలో మరో ఎల్ఎల్ఎం స్పెషలైజేషన్ను అభ్యసించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. తద్వారా ఉన్నత విద్య, నిరంతర అభ్యాసం పట్ల తనకున్న అచంచలమైన నిబద్ధతను మంత్రి సీతక్క చాటుకున్నారు.
ప్రభుత్వ పదవిలో ఉన్నప్పటికీ, ఆమె వినయంతో, అంకితభావంతో విద్యా రంగంలో ఉన్నత స్థాయిని సాధించాలనే పట్టుదలను కొనసాగిస్తుండటం పట్ల సర్వత్రా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. చదువకు వయసు, హోదా, పరిమితులు లేవనడానికి మంత్రి సీతక్క పరీక్షలో పాల్గొనడం ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తుందని ప్రశంసిస్తున్నారు.

