ఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూములను రాయితీ ధరలకు పొందిన ప్రైవేట్ ఆస్పత్రులు ఆర్థికంగా బలహీన వర్గాలకు (EWS) తప్పనిసరిగా ఉచిత వైద్య సేవలు అందించాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి ప్రామాణిక కార్యాచరణ విధానం (SOP) రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో EWS రోగులకు ఉచిత చికిత్స అమలు విషయంలో కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ 51 ఆస్పత్రుల్లో కేవలం నాలుగు ఆస్పత్రులే నిబంధనలు పాటిస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఉచిత చికిత్స తప్పనిసరి..
ప్రైవేట్ ఆస్పత్రులు తమ ఇన్పేషెంట్ విభాగంలో (IPD) 10 శాతం, అవుట్పేషెంట్ విభాగంలో (OPD) 25 శాతం వరకు ఉచిత చికిత్స అందించడం తప్పనిసరని మరోసారి స్పష్టం చేసింది. 2018లో ఇచ్చిన తీర్పును సమర్థవంతంగా అమలు చేయడానికి స్పష్టమైన SOP రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయస్థానం తీర్పును ఉల్లంఘించినట్లు తేలిన 51 ఆస్పత్రుల్లో మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వేంకటేశ్వర, మూల్ చంద్ హాస్పిటల్స్ ఉన్నాయి.

