Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంత్రి పొన్నం వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: మహేశ్ గౌడ్

మంత్రి పొన్నం వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: మహేశ్ గౌడ్

హైదరాబాద్, మే12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఖండించారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు వ్యవహారంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి లేదా ప్రభుత్వానికి పొన్నం వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఈరోజు (మంగళవారం) గాంధీభవన్‌లో మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కులసంఘం మధ్యవర్తిత్వం, వివాహం ద్వారా ఇలాంటి తీవ్రమైన కేసులను పరిష్కరించుకోవాలని పొన్నం అన్నారని తెలిపారు.

మైనర్ల విషయంలో చట్టపరంగా ఇబ్బందులు తప్పవు..

పొన్నం సూచనలను కాంగ్రెస్ ఖండిస్తోందని మహేశ్ గౌడ్ వ్యాఖ్యానించారు. మైనర్ల విషయంలో చట్టపరంగా ఇబ్బందులు తప్పవని చెప్పుకొచ్చారు. పోక్సో చట్టప్రకారం నిందితులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. నేర పరిశోధనలో నిందితుడి కులం లేదా సామాజిక హోదాతో సంబంధం లేదని తెలిపారు. బండి సంజయ్ ఈ కేసులో కుల రాజకీయాలను తీసుకురావడం దురదృష్టకరమని అన్నారు. ఈ కేసులో ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తేల్చిచెప్పారు.

పారదర్శకంగా విచారణ..

'నారీ శక్తి' అని నినాదాలు చేసే బీజేపీ, ఇప్పుడు బాలికపై జరిగిన దాడి విషయంలో మౌనంగా ఉండటం దేనికి సంకేతం..? అని మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. బాలిక కుటుంబ సభ్యులను భగీరథ్ బెదిరిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. నిజమని తేలితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కేసు విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం, కుల మతాల ప్రభావం లేకుండా పారదర్శకంగా విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. నిందితుడు ఎంతటి శక్తిమంతుడైనా సరే, బాధితురాలికి తాము అండగా నిలుస్తామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy