హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): సరస్వతీ అంత్య పుష్కరాలను (Saraswati Pushkaralu) భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) పిలుపునిచ్చారు.
మే 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు తరలి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేయాలని చెప్పారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున భక్తులు ఆరోగ్యం కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జరగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ పుష్కర శుభాకాంక్షలు తెలిపారు.
రేపటి నుంచి పుష్కరాల ప్రారంభం
మే 21వ తేదీ ఉదయం 5:43 గంటలకు తొలి పుష్కర స్నానంతో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. తొలి పుష్కర స్నానం కంచి స్వామి విజయేంద్ర సరస్వతీ చేయనుండగా, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం కానుంది.
30 నుంచి 40 లక్షల మంది భక్తుల అంచనా
12 రోజుల పాటు కొనసాగే ఈ పుష్కరాలకు సుమారు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.30.63 కోట్లతో భారీ ఏర్పాట్లు చేపట్టింది.
భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు
23 ప్రాంతాల్లో భారీ పార్కింగ్ సదుపాయాలు
245 ఎకరాల్లో 1.70 లక్షల వాహనాల పార్కింగ్ ఏర్పాటు
90 షటిల్ బస్సులతో రవాణా సదుపాయం
ఘాట్ల వద్ద చలువ పందిళ్లు, కాయర్ మ్యాట్లు
అందుబాటులో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు
500 ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు
300 మంది వైద్య సిబ్బందితో మెడికల్ క్యాంపులు
అన్ని ప్రధాన ప్రాంతాల్లో అంబులెన్సులు సిద్ధం
భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు
పుష్కర ప్రాంతంలో భద్రత కోసం 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 100 మంది గజ ఈతగాళ్లను నియమించడంతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, సేఫ్టీ బోట్లను మోహరించారు.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు
పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రత్యేక హారతి, తెప్పోత్సవాలకు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అదనంగా రూ.1.20 కోట్లతో ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయగా, నాగేంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు. మీడియా సెంటర్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
.
కేసీఆర్ హయాంలో ఆ ప్రాజెక్టుకు భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారు.. మంత్రి ధ్వజం
టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీ ఇదే
అక్రమాస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News

