Electric Vehicles: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని సుమారు కోటిన్నర మంది జనాభాకు పౌర, అత్యవసర సేవలందించే మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో రోజురోజుకి తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు సమకూరకపోవటంతో కార్పొరేషన్లు దీర్ఘకాలికంగా పలు ఖర్చులను తగ్గించుకునేందుకు సిద్ధమయ్యాయి.
ఇప్పటికే విభాగాధిపతులకు, ఇతర జోన్, సర్కిల్ స్థాయి అధికారులకు ఎలక్ట్రిక్ వాహానాలను కొనుగోలు చేసేందుకు సిద్దమైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల బాటలోనే మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ నడుస్తుంది. ఎంఎంసీ పరిధిలో ప్రస్తుతం వినియోగిస్తున్న వాహానాలన్నీ కూడా రెండు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసినవి కావటంతో పాటు తరుచూ మరమ్మతులు వస్తుండటం, మైలేజీ చాలా తక్కువగా ఉండటంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని సమకూర్చుకోవటంతో పాటు ఇంధనం ఖర్చు లేకుండా, పర్యావరణ హితమైన వాహానాలను కొనుగోలు చేసేందుకు ఎంఎంసీ కూడా సిద్దమైంది.
తొలుత తార్నాకలోని..
తొలుత విభాగాధిపతులుకు 45, ఇతర క్యాడర్ ఆఫీసర్లకు మరో 52 వాహానాలను కొనుగోలు చేయాలని చేసిన ప్రతిపాదనకు ఇటీవలే జరిగిన స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో కార్పొరేషన్ ఈ-వాహానాలను సమకూర్చుకునేందుకు సిద్దమైంది. తొలుత తార్నాకలోని ప్రధాన కార్యాలయంలోని శానిటేషన్, ఐటీ, ఫైనాన్స్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, హెల్త్, లీగల్, అడ్మిన్ వంటి విభాగాధిపతులకు ఈ కొత్త కార్లను సమకూర్చిన తర్వాత జోనల్ స్థాయిలో విధులు నిర్వహించే వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులకు, ఆ తర్వాత సర్కిల్ స్థాయిలో బాస్ గా వ్యవహారించే డిప్యూటీ కమిషనర్లకు, మెడికల్ ఆఫీసర్లకు కొత్త ఈ-వాహానాలను సమకూర్చేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఆ తర్వాత దశల వారీగా స్వచ్ఛ టిప్పర్ ఆటోలను కూడా ఈ-వెహికల్స్ గా మార్చాలని కూడా అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.
మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బు.. దర్యాప్తులో సంచలనాలు!
కొత్త భవనం కోసం డిజైన్ల పరిశీలన
మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం తార్నాకలోని హెచ్ఎండీఏ ఆఫీసులో కొనసాగుతున్నా, శాశ్వత ఆఫీసు భవనాన్ని నిర్మించేందుకు సర్కారు ఇటీవలే ఉప్పల్ భగాయత్ లో పది ఎకరాల స్థలాన్ని రూ.90 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెల్సిందే. సర్కారు ఎలాగో మంజూరీ ఇచ్చినందున వీలైనంత త్వరగా సొంత భవనాలను నిర్మించుకునేందుకు కూడా ఎంఎంసీ ప్రయత్నాలు ప్రారంభించింది. అన్ని విభాగాధిపతులకు సరిపోయేలా సుమారు పది అంతస్తుల భవనాలను నిర్మించాలని భావిస్తున్నట్లు, అందుకు అవసరమైన డిజైన్లపై ఎంఎంసీ కార్పొరేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా రానున్న 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పచ్చదనంతో పాటు భారీగా వాటర్ హార్వేస్టింగ్ పాయింట్లతో ఈ భవనాలను నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అవసరమైతే పొడియం, సెల్లార్ పార్కింగ్ లతో ఈ భవనాలను నిర్మించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రధాన కార్యాలయంలోని అన్ని వింగ్ ల విభాగాధిపతులతో పాటు అన్ని జోన్ల ఆఫీసులు ఉప్పల్ భగాయత్ లోనే నిర్మించి, సర్కిళ్ల వారీగా భవనాలను స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మించేందుకు కార్పొరేషన్ కు చెందిన స్థలాలను కూడా అన్వేషిస్తున్నట్లు తెలిసింది.

