IPL Tickets: స్వేచ్ఛ బ్యూరో: మంత్రులు.. జడ్జిల పేర్లు వాడుకోవటంతోపాటు సంతకాలను ఫోర్జరీ చేస్తూ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముతున్న గ్యాంగ్ లోని ముగ్గురిని ఎస్వోటి అధికారులు ఉప్పల్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి 22వేల రూపాయల ధర ఉన్న అయిదు టిక్కెట్లు, మహీంద్రా థార్ వాహనం, అయిదు మొబైల్ ఫోన్లు, ఫోర్జరీ చేసిన అయిదు లెటర్ హెడ్లను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి సీపీ సుమతి, ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తో కలిసి వివరాలు వెల్లడించారు.
మహీంద్రా థార్ కారులో..
ఈనెల 3న ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో స్టేడియం పార్కింగ్ వద్ద కొందరు టిక్కెట్లను బ్లాక్లో అమ్ముతున్నట్టు పోలీసులకు తెలిసింది. వెంటనే ఉప్పల్ ఎస్ఐ మాధవరెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. మహీంద్రా థార్ కారులో కూర్చొని టిక్కెట్లు అమ్ముతున్న గట్టమనేని అశోక్, కంకనాల దినేష్, సింగమనేని వేణుమాధవ్లను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా, మిగిలిన ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు. నిందితులు ముగ్గురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పల్కూరు గ్రామానికి చెందిన వారు. చెన్నైకి చెందిన ఆశిష్, సెంథిల్, తాన్సిల్ తో కలిసి ఈ దందా చేస్తున్నట్టు విచారణలో వెళ్లడయ్యింది.
ఖమ్మంలో మెగా జాబ్ మేళా.. 3200 మంది యువతకు ఉపాధి అవకాశం!
గూగుల్ నుంచి డౌన్ లోడ్ చేసి..
ఈ గ్యాంగ్ సభ్యులు గూగుల్ నుంచి జడ్జీలు, మంత్రులు మరియు గవర్నర్ల అధికారిక లెటర్ హెడ్లను డౌన్లోడ్ చేసేవారని తేలింది. ఆ తర్వాత వాటిపై ప్రముఖుల సంతకాలను ఫోర్జరీ చేసి హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లకు పంపించే వారని తెలిసింది. ఇలా వీవీఐపీ కోటాలో ఖరీదైన కాంప్లిమెంటరీ టిక్కెట్లు పొంది వాటిని పెద్ద మొత్తాలకు బ్లాక్లో అమ్ముతున్నట్టు నిర్ధారణ అయ్యింది. అరెస్ట్ చేసిన ముగ్గురిని జైలుకు రిమాండ్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

