విక్రమ్ సహిదేవ్, 'శ్రీ చిదంబరం గారు' ఫేమ్ సంధ్యా వశిష్ట జంటగా నటించిన సినిమా 'అనకాపల్లి'. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన తన మిత్రుడు కాండ్రేగుల నాయుడుతో కలిసి ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాతో ఖగేష్ తమ్మినేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బుధవారం రాత్రి అనకాపల్లిలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో చిత్ర నిర్మాతలు కీలక ప్రకటన చేశారు.
ఇటీవల జరిగిన పరిణామాలు, చిత్రానికి వస్తున్న స్పందన నేపథ్యంలో విడుదల తేదీని కొద్దిగా వాయిదా వేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ, 'ఇటీవల మా చిత్రానికి ప్రత్యేకంగా నిర్వహించిన డిస్ట్రిబ్యూటర్స్ షోకు అనూహ్యమైన, అద్భుతమైన స్పందన లభించింది. సినిమా కంటెంట్ చూసిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని కేవలం తెలుగు వరకే పరిమితం చేయకుండా, తమిళం, మలయాళం తదితర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అదే సమయంలో చిత్రంపై ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, తొందరపడి విడుదల చేయడం కంటే సినిమాకు లభిస్తున్న అవకాశాలను పూర్తిగా పరిశీలించి, సరైన ప్రణాళికతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాం' అని తెలిపారు.
వారు మరింత విపులంగా తమ సరికొత్త స్ట్రేటజీ గురించి చెబుతూ, 'మా చిత్రం మీద మాకున్న నమ్మకంతో, థియేట్రికల్ రిలీజ్కు ముందే అనకాపల్లి పట్టణంలో 4 నుంచి 5 ప్రత్యేక పబ్లిక్ షోలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. ఇవి ఇండస్ట్రీ కోసం వేసే ప్రివ్యూ షోలు కావు. సెలబ్రిటీల కోసం వేసే స్పెషల్ షోలు కావు. నిజమైన ప్రేక్షకుల కోసం… అనకాపల్లి ప్రజల కోసం వేసే షోలు. వాళ్లు సినిమా చూడాలి. వాళ్లు ఎంజాయ్ చేయాలి. వాళ్లే సినిమా ఎలా ఉందో చెప్పాలి. మా 'అనకాపల్లి'కి తొలి తీర్పు… అనకాపల్లి నుంచే రావాలి. అంతర్జాతీయ సినిమాల్లో ఫెస్టివల్స్, ప్రత్యేక పబ్లిక్ స్క్రీనింగ్స్ అనంతరం విస్తృతంగా విడుదల చేసే పద్ధతిని చూస్తుంటాం. అదే తరహాలో తెలుగు సినిమాలో ఒక అరుదైన ప్రయత్నంగా 'ముందు ప్రజల తీర్పు… ఆ తర్వాత రిలీజ్' అనే నిర్ణయంతో ముందుకు వెళ్ళబోతున్నాం. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన, ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూపిస్తున్న ఆసక్తి, ఇతర భాషల్లో విడుదల చేసే అవకాశాలు, అన్నింటికంటే ముఖ్యంగా అనకాపల్లి ప్రజల నుంచి వచ్చే తొలి తీర్పు... వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కొత్త విడుదల తేదీని నిర్ణయించనున్నాం. దానిని ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తాం. మా సినిమా మీద మాకు నమ్మకం ఉంది. అందుకే ముందు మా మాట కాదు… ప్రజల మాట వినాలనుకుంటున్నాం' అని నిర్మాతలు చెప్పారు.
ప్రముఖ నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీషా దంపతుల తనయుడైన విక్రమ్ సహిదేవ్ ఇప్పటికే పలు చిత్రాలలో నటించి, నటుడిగా మంచి మార్కులు పొందాడు. ఇప్పుడీ సినిమాతో అతనికి మాస్ హీరోగా చక్కని గుర్తింపు వస్తుందని, ఇందులో ప్రేక్షకుల ఊహకందని లవ్ ట్విస్ట్ ఉందని, అలానే జన్ జీ కి బాగా నచ్చే అంశాలు ఉన్నాయని నిర్మాతలలో ఒకరైన త్రినాథరావు నక్కిన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
తండ్రి పాత్రకు పొట్ట బాగా ఉండాలన్నారు.. ఏం చేసేవాడినంటే: త్రినాథరావు నక్కిన

