ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి, ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఆయనను పరామర్శించేందుకు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. సీఎం చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి శ్రీమతి అనా కొణిదెల స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సీఎంకు స్వాగతం పలికిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత తన హెల్త్కు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. ప్రస్తుతం తనకున్న ఆరోగ్య సమస్య నుంచి రికవరీ అయ్యానని తెలిపినట్లుగా తెలుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే, ఆయన వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆయనకు సర్జరీ అవసరమని రిపోర్ట్స్ను పరిశీలించిన వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకు వెంటనే శస్త్రచికిత్సను ముగించారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని వైద్యులు సూచించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విశ్రాంతిలో ఉన్నారు. త్వరలోనే ఆయన మళ్లీ డ్యూటీ ఎక్కనున్నారు.

