తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్పై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. నటి త్రిషపై చేసిన వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్ను అరెస్టు చేసిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ప్రజల అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా స్పందించిన ఎంకే స్టాలిన్.. అహంకారం వినాశనానికి దారి తీస్తుంది.
మొండితనంతో కూడిన అహంకారం మరింత వేగంగా పతనానికి కారణమవుతుంది అంటూ ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. కావేరి జలాల అంశం, మేకేదాటు డ్యామ్ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే ఉదయనిధిని అరెస్టు చేశారని ఆరోపించారు. తంజావూరులో నిర్వహించిన డీఎంకే నిరసనలో రైతులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొనడం ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తికి నిదర్శనమని ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. కావేరి జలాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న వైఖరినే ఉదయనిధి స్టాలిన్ విమర్శించారని.. దానికి సమాధానం చెప్పాల్సింది పోయి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.
ఉదయనిధి స్టాలిన్ను విచారణ కోసం చెన్నైలోనే ప్రశ్నించవచ్చని.. అయితే ఎందుకు తంజావూరుకు తరలించారని ఎంకే స్టాలిన్ ప్రశ్నించారు. ప్రశ్నించడం మాత్రమే ఉద్దేశమైతే అనేక నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఎందుకు నమోదు చేశారని నిలదీశారు. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టులో ప్రభుత్వం విచారణ అనంతరం విడుదల చేస్తామని చెప్పడం తమ వాదనకు బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు.
కావేరీ జలాలు, మేకెదాటు ప్రాజెక్ట్ విషయంలో తమిళనాడు హక్కులను హరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. దాన్ని అడ్డుకునేందుకే డీఎంకే పార్టీ ఆందోళన చేపట్టిందని ఎంకే స్టాలిన్ తెలిపారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలకు సమాధానం ఇచ్చే ధైర్యం విజయ్ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. కావేరీ నీటిని సీఎం విజయ్ తీసుకురాలేరని.. ఆయనో డమ్మీ ముఖ్యమంత్రి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయ్ మంత్రివర్గంలోని మంత్రులు ఒక సినిమా (జననాయగన్)ను పట్టుకుని వేలాడుతున్నారని.. తమిళనాడులో ఓ జోకర్ క్యాబినెట్ అధికారంలో ఉందని ఎంకే స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు.
నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో సోమవారం ఉదయం పోలీసులు ఉదయనిధి స్టాలిన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ప్రశ్నించిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ను స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు.

