సన్ రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు చేసింది. ముల్లాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన సన్ రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్..
ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కానీ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ.. మెరుపులతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు స్కోరు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్కు వైభవ్ సూర్యవంశీ మెరుపు శుభారంభం అందించాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లే ముగిసే సరికి 80/0తో నిలిచింది. వైభవ్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం శరవేగంగా సెంచరీ వైపు దూసుకెళ్లాడు. కానీ 29 బంతుల్లో 97 రన్స్ చేశాక వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్కు శుభం కార్డు పడింది. ప్రఫుల్ హింగే బౌలింగ్లో అతడు ఔట్ అయ్యాడు.
ఆ తర్వాత ధ్రువ్ జురెల్ (21 బంతుల్లో 50 రన్స్) బ్యాట్ ఝుళిపించడంతో రాజస్థాన్ రాయల్స్.. స్కోరు బోర్డు 15 ఓవర్లలోనే 200 పరుగుల మార్కును దాటింది. దీంతో ఈజీగా 270 రన్స్ చేసేలా కనిపించింది. కానీ ఇక్కడే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు మ్యాచ్ను మలుపుతిప్పారు. కట్టుదిట్టంగా బంతులేయడం, ఫీల్డర్లు కూడా సహకరించడంతో రాజస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది.
ఓ దశలో 15 ఓవర్లకు 207/3తో నిలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఆ తర్వాత అనూహ్యంగా తడబడింది. చివరి ఐదు ఓవర్లలో 36/5 గణాంకాలు నమోదు చేసింది. దీంతో ఊహించిన దానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ అత్యధికంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రఫుల్ హింగే మూడు వికెట్లు తీయగా.. ఈషన్ మలింగ, శివంగ్ కుమార్, నితీశ్ కుమార్ రెడ్డి ఒక్కో వికెట్ తీశారు. నితీశ్ 2 ఓవర్లు వేసి.. కేవలం 12 రన్స్ మాత్రమే ఇవ్వడం గమనార్హం.

