USA Road Accident: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతి మరణించిన ఘటనలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. మొదట సాధారణ ప్రమాదంగా భావించిన ఈ కేసులో, ఏకంగా రూ.
1,400 కోట్ల భారీ ఆర్థిక కుంభకోణానికి (Financial Scam) సంబంధించిన లింకులు బయటపడటం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఐలూరు/మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి వసంతరావు, మల్లీశ్వరి దంపతుల కుమార్తె అట్లూరి ప్రసన్న ఉన్నత చదువులు, ఉద్యోగం నిమిత్తం అమెరికాలో నివసిస్తున్నారు. అయితే, అక్కడ జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రసన్న మృతి చెందారు. ఆమె మరణవార్త విని స్వగ్రామంలోని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు.
Read Also : Ethanol -20 : విధానాలు, వివాదాలలో ఇథనాల్

USA Road Accident: రూ. 1,400 కోట్ల కుంభకోణం.. డైరెక్టర్గా ప్రసన్న సంతకం!
ఇలాంటి తరుణంలో, ప్రసన్న మృతి వెనుక ఒక పెద్ద స్కామ్ దాగి ఉందనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. దేశంలో సంచలనం సృష్టించిన ఒక భారీ మోసపూరిత కంపెనీతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 'షేక్ బజార్ కిసాన్ పరివార్' అనే సంస్థ పేరుతో భూపాల్ నాయక్ అనే వ్యక్తి, మరికొందరు నిందితులు కలిసి ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేశారు. ఈ స్కామ్ విలువ సుమారు రూ. 1,400 కోట్లు ఉంటుందని అంచనా. అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే.. ఈ కంపెనీకి డైరెక్టర్గా ఉన్న ఒప్పంద పత్రాలపై (Agreement Documents) మృతి చెందిన ప్రసన్న సంతకం చేసినట్లు పోలీసుల పరిశోధనలో తేలింది.
గుజరాత్ పోలీసుల దర్యాప్తు.. అనుమానాస్పదంగా మరణం!
ఈ రూ. 1,400 కోట్ల డిపాజిట్ల మోసానికి సంబంధించి ఇప్పటికే ప్రధాన సూత్రధారి అయిన భూపాల్ నాయక్ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో లోతైన విచారణ జరుపుతున్న క్రమంలోనే ప్రసన్న మరణవార్త వెలుగులోకి వచ్చింది. ఈ కంపెనీ లావాదేవీల్లో ప్రసన్న పాత్ర ఎంతవరకు ఉంది? ఆమెను ఎవరైనా పావుగా వాడుకున్నారా? లేదా ఈ స్కామ్ బయటపడుతుందనే ఉద్దేశంతో ఆమె మరణం వెనుక ఏమైనా కుట్ర జరిగిందా? అనే పలు అనుమానాలకు ఈ ఘటన తావిస్తోంది. ఒకవైపు గుజరాత్ పోలీసులు, మరోవైపు అంతర్జాతీయ ఏజెన్సీల సమన్వయంతో ఈ కేసుపై దర్యాప్తు మరింత ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దొంగతనం నింద వేసి అవమానించారని.. 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య!

