ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని, దీనిని మార్చే శక్తి ఎవరికీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ఉద్ఘాటించారు.
అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భంగా ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. శాతవాహనుల కాలం నాటి చారిత్రక నేపథ్యం ఉన్న అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని, బ్రిటీష్ మ్యూజియంలో కూడా ప్రత్యేక గ్యాలరీ ఉండటమే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకూడదని, భవిష్యత్ తరాలకు రాజధాని విషయంలో ఎలాంటి అభద్రతాభావం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ చట్టబద్ధత ప్రక్రియను చేపట్టినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Read Also : Telangana: అక్రమ మైనింగ్పై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

తెలంగాణకు భారీ ఆదాయం
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో ఉమ్మడి రాష్ట్రంలో తాము వేసిన పునాదులను చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. 1990లలో ఆర్థిక సంస్కరణలు, ఇంటర్నెట్ విప్లవాన్ని అందిపుచ్చుకుని సైబరాబాద్ను నిర్మించడం వల్లే నేడు తెలంగాణకు భారీ ఆదాయం సమకూరుతోందని ఆయన విశ్లేషించారు. విభజన తర్వాత ఏపీకి కనీసం కార్యాలయాలు కూడా లేని స్థితిలో, బస్సుల్లో పాలన సాగించిన గడ్డు పరిస్థితులను ఆయన గుర్తు చేసుకున్నారు. కేవలం తొమ్మిది నెలల్లోనే సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించి చూపించామని, సింగపూర్ కంటే మెరుగైన రాజధానిని నిర్మించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతుల నమ్మకాన్ని వమ్ము చేయబోమని ఆయన హామీ ఇచ్చారు.
జగన్ ‘మూడు రాజధానుల’ అంశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనుసరించిన ‘మూడు రాజధానుల’ విధానంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని విషయంలో జగన్ ఊసరవెల్లి రాజకీయాలు చేశారని, అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసి రాష్ట్ర ప్రయోజనాలకు ద్రోహం చేశారని విమర్శించారు. ప్రస్తుతం అమరావతిలో రూ. 56,000 కోట్ల విలువైన పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2028 నాటికి మెజార్టీ నిర్మాణాలు పూర్తి చేస్తామని గడువు విధించారు. అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామని, పార్లమెంటు ఆమోదంతో ఇది పటిష్టమైన చట్టంగా మారుతుందని.. ఆ తర్వాత అమరావతిని ఎవరూ తాకలేరని సీఎం చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
తల్లి బతికే ఉందని నమ్మించి ఏడేళ్లుగా పెన్షన్ తీసుకున్న ప్రబుద్దుడు

