Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి భగీరథ్ కేసులో కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ ఫైర్

బండి భగీరథ్ కేసులో కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ ఫైర్

వార్త 2 days ago

KTR press meet: తెలంగాణ రాజకీయాల్లో బండి భగీరథ్ వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బండి భగీరథ్ లొంగిపోయాడని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ చెబితే, తామే పోలీసులతో అరెస్టు చేయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వీరిద్దరూ తోడు దొంగలని, ప్రజలను మోసం చేయడానికి కలిసి డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి కేవలం హైట్ ఒక్కటే తక్కువ అనుకున్నానని, కానీ ఇప్పుడు చూస్తే ఆయనకు బుర్ర కూడా తక్కువేనని ఎద్దేవా చేశారు.

Read Also : Kalvakuntla Kavitha: సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత.. కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు

 KTR fires on Congress, BJP in Bandi Bhagirath case

బీజేపీ తీరుపై మండిపాటు

బండి భగీరథ్ కేసు పూర్తి వివరాలను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. భగీరథ్‌కు ముందస్తు బెయిల్ ఇప్పించేందుకు తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు జరిగాయని, అయితే హైకోర్టులో వారికి అనుకూలంగా తీర్పు రాలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో ఒక పక్క అమ్మాయికి అన్యాయం జరిగితే, న్యాయం చేయాల్సిందిపోయి ఆ బాధితురాలి వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియా లో బయటపెట్టింది బీజేపీ వారేనని ఆరోపించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వివాదానికి సంబంధించి దాదాపు 15 మందిపై కేసులు నమోదయ్యాయని, వారంతా బీజేపీకి చెందినవారేనని కేటీఆర్ గుర్తు చేశారు.

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను ఉద్దేశించి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి రైతులకు, ప్రజలకు ‘చావు కబురు చల్లగా చెప్పి’ వెళ్లారని విమర్శించారు. రైతులు పొలాల్లో యూరియా వాడకాన్ని తగ్గించాలని, అలాగే ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలని మోదీ ఉచిత సలహాలు ఇచ్చారని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం సేకరించడం లేదని, అన్నదాతలు రోడ్లపైకి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ప్రస్తుత సీజనే కాకుండా, ముందు వచ్చే సీజన్‌లో కూడా రైతులకు కష్టాలు, ఇబ్బందులు తప్పవని కేటీఆర్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో రైతులకు కావాల్సిన ధాన్యం బస్తాలు మార్కెట్లో ఎక్కడా దొరకడం లేదు కానీ, నేరగాళ్లకు కావాల్సిన గన్‌లు, తుపాకులు మాత్రం రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్నాయని శాంతిభద్రతల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిపోతోందని కేటీఆర్ విమర్శించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha