Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భయాందోళనకు గురి చేస్తున్న గజరాజులు!

భయాందోళనకు గురి చేస్తున్న గజరాజులు!

వార్త 1 week ago

Manyam District Elephants: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల పరిధిలోని మార్కొండపుట్టి పంచాయతీ గ్రామాల్లో గజరాజులు మళ్లీ కలకలం సృష్టించాయి.

మంగళవారం ఉదయం నుండి పెదగాసిల, పాతగాసిల, కే.గాసిల గ్రామాలలో ఏనుగుల గుంపు స్వైరవిహారం చేయడంతో స్థానిక గ్రామస్తులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏనుగుల కదలికలను గమనించిన అటవీ శాఖ ఎలిఫెంట్ ట్రాకర్ల (Elephant Trackers) బృందం వాటిని పర్యవేక్షిస్తూ అడవిలోకి తోలేందుకు ప్రయత్నించింది. అయితే, ఏనుగుల గుంపు వచ్చిందనే వార్త తెలియడంతో పరిసర ప్రాంతాల నుండి జనాలు వాటిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో జనాల తాకిడిని నియంత్రించలేక, ఏనుగులను దారి మళ్లించలేక ఫారెస్ట్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Read also: Rayadurgam Tumakuru Railway: రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం పావగడ పూర్తి !

గత కొన్ని సంవత్సరాలుగా మన్యం జిల్లాలో గజరాజులు స్థిర నివాసాలు ఏర్పరచుకుని సంచరిస్తున్నాయి. అధికారులు వీటిని పూర్తిగా దట్టమైన అడవుల్లోకి తరలించేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అవి మళ్లీ మళ్లీ గ్రామాల సమీపంలోకే వస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులు పరిసర గ్రామాల్లో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అలర్ట్ చేస్తున్నప్పటికీ, ఏ క్షణంలో ఏనుగులు ఏ వైపు నుండి దాడి చేస్తాయోనని ఇక్కడి ప్రజలు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు.

Manyam District Elephants: అరటి తోటలు, వ్యవసాయ పరికరాలు ధ్వంసం..

మంగళవారం ఉదయం పాతగాసిల గ్రామ సమీపంలోకి ప్రవేశించిన గజరాజుల గుంపు అక్కడ ఉన్న ఒక పెద్ద అరటి తోటలో తిష్ట వేసింది. తోటలోని అరటి చెట్లను పూర్తిగా తొక్కి వేయడమే కాకుండా.. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గోవుల సాల (పశువుల కొట్టం) ను, రైతులు అమర్చుకున్న డ్రిప్ ఫిల్టర్లను, ఇతర విలువైన వ్యవసాయ ఉపకరణాలను పూర్తిగా తొక్కి ధ్వంసం చేశాయి. దీనివల్ల తమకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని, చేతికొచ్చే పంటతో పాటు పెట్టుబడి పెట్టిన పరికరాలు కూడా విరిగిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు కన్నీరుమున్నీరయ్యారు.

తమను ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, శాశ్వత ప్రాతిపదికన ఈ ఏనుగుల దారి మళ్లించి, అవి మళ్లీ జనావాసాల్లోకి రాకుండా దట్టమైన అడవుల్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలని మన్యం గ్రామస్తులు గట్టిగా కోరుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha