Dailyhunt
బొబ్బిలిగావ్‌లో "రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" కార్యక్రమం విజయవంతం

బొబ్బిలిగావ్‌లో "రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" కార్యక్రమం విజయవంతం

వార్త 6 days ago

Sadashivpet Mandal: బొబ్బిలిగావ్ గ్రామం, సదాశివపేట మండలం, సంగారెడ్డి జిల్లా లోని బతుకమ్మ కుంట వద్ద మే 2, 2026న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో "రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి మొత్తం 110 మంది రైతులు హాజరయ్యారు. ఇందులో 65 మంది మహిళా రైతులు, 45 మంది పురుష రైతులు పాల్గొన్నారు.

Read Also: Dogs Blood Trade Rumors: కుక్కల రక్తంతో దందా అనేది అబద్ధం.. పెట్స్ కేర్ ఛైర్మన్ వెంకట్ యాదవ్

ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలకు చెందిన అగ్రోనమీ విభాగం శాస్త్రవేత్త డా. పి. రేవతి, వ్యవసాయ విస్తరణ విభాగానికి చెందిన డా. కె. రాకేష్ పాల్గొన్నారు. అలాగే వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్. ప్రకాశ్, గ్రామ సర్పంచ్ ఎస్. ఉమాదేవి, ఉపసర్పంచ్ జి. విజయేందర్, వార్డు సభ్యులు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Sadashivpet Mandal: తక్కువ ఖర్చు – ఎక్కువ దిగుబడిపై శాస్త్రవేత్తల సూచనలు

డా. పి. రేవతి "రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" కార్యక్రమంలోని 6 అజెండా అంశాలపై స్పష్టంగా, విపులంగా రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ యూరియా వినియోగం, సాగు ఖర్చులు తగ్గించడం, పంట మార్పిడి, మార్కెట్‌కు అనుగుణంగా పంటల ఎంపిక, సహజ వనరుల సంరక్షణ వంటి అంశాలను వివరించారు. రసాయనాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, సిఫారసు చేసిన మోతాదులను సరిగ్గా పాటించాలని సూచించారు. పిచికారీ సమయంలో రక్షణ చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని వివరించారు. రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

 Raitu Mungitlo Shastravethalu

డా. కె. రాకేష్ రైతులతో పరస్పర చర్చ జరిపి, వారి సమస్యలను తెలుసుకున్నారు. వ్యవసాయ విస్తరణ సేవల ప్రాముఖ్యతను వివరించి, శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చని సూచించారు.వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్. ప్రకాశ్ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలపై రైతులకు వివరించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎస్. ఉమాదేవి మాట్లాడుతూ, రైతులను ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 4-5 ఎకరాలలో మోడల్ విలేజ్ తరహా ప్రదర్శన క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే శాస్త్రవేత్తలు ఇలాంటి కార్యక్రమాలను తరచుగా నిర్వహిస్తే రైతులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.రైతులు ఈ కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha