QR Code System: దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్ ద్వారా సరఫరా చేసే బియ్యం బస్తాలకు ఇకపై క్యూఆర్ కోడ్ (QR Code) విధానాన్ని అనుసంధానించనున్నట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధికారికంగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ అద్భుతమైన ఫలితాలను ఇవ్వడంతోనే, దీనిని దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సరికొత్త టెక్నాలజీ వల్ల రేషన్ బియ్యం సరఫరాలో పారదర్శకత పెరగడమే కాకుండా, అక్రమ రవాణాకు శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Read also: AP High Court: భవన నిర్మాణ పర్మిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
తిరుపతిలో కేంద్ర మంత్రి ప్రకటన.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశంసలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి ఈ కీలక వివరాలను పంచుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఈ సాంకేతికతను పర్యవేక్షిస్తున్న తీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో క్యూఆర్ కోడ్ అమలు చేయడం వల్ల బియ్యం పక్కదారి పట్టే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని, మిల్లింగ్ కేంద్రం నుండి పేద లబ్ధిదారుడి చేతికి చేరే వరకు ప్రతి దశను డిజిటల్ పద్ధతిలో నిశితంగా పర్యవేక్షించే వీలు కలిగిందని ఆయన వివరించారు.
పీడీఎస్ ఆధునికీకరణ.. తెలంగాణ, ఒడిశాలోనూ విస్తరణ
సబ్సిడీ ఆహార ధాన్యాల పంపిణీ వ్యవస్థను ఆధునిక సాంకేతికతతో అనుసంధానించి, కేవలం అర్హులైన వారికే లబ్ధి చేకూరేలా చేయడమే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి జోషి పేర్కొన్నారు. ఏపీలో సక్సెస్ అయిన ఈ డిజిటల్ విధానాన్ని ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశాలలో కూడా అమలు చేసేందుకు కేంద్రం అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత, ‘డిజిటల్ ఇండియా’ లక్యం మేరకు సాంకేతికత ఆధారిత సమర్థవంతమైన పాలనను అందించడంలో భాగంగానే ఈ విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు ఆయన వివరించారు.
ఏపీకి భారీగా కేంద్ర నిధులు.. కీలక ప్రాజెక్టులకు పూర్తి మద్దతు
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక ప్యాకేజీలు, సహాయాన్ని మంత్రి గుర్తుచేశారు. గత యూపీఏ పాలనతో పోల్చి చూస్తే.. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్కు ఏకంగా 325 శాతం అధికంగా నిధులను కేటాయించినట్లు గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా పూర్తి స్థాయి సహకారం ఎప్పటికీ కొనసాగుతుందని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

