మున్సిపల్ పాలకవర్గం, సీనియర్ నేతలతో పొన్నం ప్రభాకర్ భేటీ
Ponnam Prabhakar: హుస్నాబాద్ మున్సిపాలిటీలో 'ఏబీసీడీ రాజకీయం' సాగుతోందంటూ సోమవారం వెలుగులోకి వచ్చిన వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి సోమవారం ఉదయమే హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా హుస్నాబాద్కు వచ్చి మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించినట్లు అందిన సమాచారం మేరకు తెలిసింది.
Municipal Council Meeting
Ponnam Prabhakar: ఎవరి బాధ్యతలు వారే నిర్వర్తించాలి సూచన
సమావేశంలో మున్సిపాలిటీ పరిపాలన, అభివృద్ధి పనులు, ప్రజాప్రతినిధుల పాత్ర, పార్టీ నాయకుల జోక్యం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల అధికారాలు, బాధ్యతలను గౌరవించాలని, ఎవరి పనులు వారే చేసుకోవాలని మంత్రి స్పష్టమైన సూచనలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇటీవల మున్సిపాలిటీలో కొందరు ప్రభావశీల నాయకుల చుట్టూ పరిపాలన తిరుగుతోందనే ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పాలనలో సమన్వయం, పారదర్శకత ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అందరూ కలిసి పనిచేయాలని మంత్రి సూచించినట్లు తెలిసింది.
మంత్రి నిర్వహించిన ఈ సమావేశం తర్వాత హుస్నాబాద్ రాజకీయాల్లో నెలకొన్న చర్చలకు కొంతవరకు తెరపడుతుందా..? లేక మరిన్ని పరిణామాలకు దారితీస్తుందా..? అనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also:

