Revanth Reddy MP Meeting: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల సాధనే ఏకైక పరమావధిగా కేంద్రం వద్ద మన గళాన్ని బలంగా వినిపించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) పార్లమెంట్ సభ్యులకు పిలుపునిచ్చారు.
ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల (Parliament Sessions) దృష్ట్యా మంగళవారం (జూలై 14) హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాష్ట్రానికి చెందిన ఎంపీలతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ కీలక భేటీకి అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలు కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న వివిధ ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులపై అధికారుల చేత ఎంపీలకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం వివరించారు. అభివృద్ధి విషయంలో భేషజాలు పక్కనబెట్టి రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగుదామని స్పష్టం చేశారు.
Read Also :CM Revanth Delhi Visit: ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ఢిల్లీ వేదికగా సాధించాల్సిన కీలక అంశాలు

తెలంగాణ వృద్ధిని మార్చే కీలక ప్రాజెక్టుల పురోగతిపై ఎంపీలు ఢిల్లీలో ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో ఐఐఎం (IIM) ఏర్పాటుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలవాలని, మెట్రో ఫేజ్-1 స్వాధీనం, రెండో దశ విస్తరణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూడాలని కోరారు. ముఖ్యంగా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు సీఎం విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR) ఉత్తర భాగంలో 95% భూసేకరణ పూర్తయిందని, దక్షిణ భాగం అనుమతులకు కేంద్ర కేబినెట్ ఆమోదం అవసరమని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవనం పనులను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకునేలా కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను కలవాలని సూచించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబై బుల్లెట్ రైళ్ల అలైన్మెంట్లు కొలిక్కి వచ్చాయని.. ఆదిలాబాద్, వరంగల్ డిఫెన్స్/ఎయిర్పోర్ట్లకు భూసేకరణ పూర్తయినందున అక్కడ ఎయిర్ కార్గో, ఎంఆర్ఓ (MRO) కేంద్రాలు సాధించాలని స్పష్టం చేశారు.
అంతరాష్ట్ర నదీ జలాలు – ప్రాజెక్టుల వ్యూహం
ఇటీవల జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఏపీ, కర్ణాటక సీఎంలతో జరిగిన చర్చలను రేవంత్ రెడ్డి ఎంపీలకు వివరించారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు 15.09 టీఎంసీల నీరు రావాల్సి ఉన్నా పూడిక వల్ల 5 టీఎంసీలు కూడా రావడం లేదని, పూడికతీతపై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. గోదావరి-కావేరి అనుసంధానంలో ఛత్తీస్గఢ్ వాడుకోని మిగులు జలాల నుంచి తెలంగాణకు దక్కాల్సిన 43 టీఎంసీలను అనుకూలంగా సాధించుకోవాలన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో త్వరలో భేటీ అవుతామని, ఉమ్మడి రాష్ట్ర ప్రాజెక్టులకు ఏపీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) వచ్చేలా కేంద్ర మంత్రిని కలవాలని సూచించారు.
Revanth Reddy MP Meeting: ఢిల్లీలో ప్రత్యేక అధికారి.. సింగరేణి హక్కులపై భట్టి స్పష్టత
రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఎంపీలకు అవసరమైన అధికారిక సమాచారాన్ని వేగంగా అందించడానికి ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ను నియమించినట్లు వెల్లడించారు. అన్ని పార్టీల ఎంపీలను సమన్వయం చేసే బాధ్యతను నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవికి అప్పగించారు. సింగరేణి ప్రయోజనాల కోసం గోదావరి పరివాహక ప్రాంతంలోని బొగ్గు బ్లాకులను వేలం లేకుండా నేరుగా కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని భట్టి కోరారు. గతంలో ప్రైవేట్కు ఇచ్చిన సత్తుపల్లి, కోయగూడెం-3 బ్లాకులను తిరిగి సింగరేణికే దక్కేలా చూడాలన్నారు. హైదరాబాద్కు రాబోతున్న సెమీకండక్టర్ పరిశ్రమ రాష్ట్రాభివృద్ధికి 'గేమ్చేంజర్' కానుందని, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్లు డిప్యూటీ సీఎం వివరించారు.

