Yoga Andhra 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా 'యోగాంధ్ర-2026' కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
జూన్ 21వ తేదీన రాబోయే 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' (International Yoga Day) నిర్వహణపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు యోగాంధ్ర-2026కు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ప్రజెంటేషన్ను సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరినీ ఆరోగ్య మార్గంలో నడిపించేందుకు రూపొందించిన ఈ మెగా ఈవెంట్ విశేషాలు ఇలా ఉన్నాయి.
Read Also :AP Pension : ఏపీలోని వితంతువులకు శుభవార్త

14 రోజుల పాటు 'ఒక జిల్లా – ఒక థీమ్'
యోగాంధ్ర-2026లో భాగంగా జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విసృతంగా కార్యక్రమాలు జరగనున్నాయి.
- థీమ్ ఆధారిత వేడుకలు: ప్రతి జిల్లాలో ‘ఒక జిల్లా – ఒక థీమ్’ చొప్పున ఈ 14 రోజుల పాటు వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- నిధుల కేటాయింపు: జిల్లాల్లో యోగాంధ్ర నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రూ. 25 లక్షల చొప్పున ప్రత్యేక నిధులను ప్రభుత్వం కేటాయించింది.
- ట్రైనర్లకు శిక్షణ: ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 1.50 లక్షల మంది యోగా శిక్షకులకు అదనంగా, మరో లక్ష మందిని కొత్తగా శిక్షకులుగా మార్చేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నారు.
అమరావతి బ్రిడ్జిపై 25 వేల మందితో మహా ప్రదర్శన
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు రాజధాని అమరావతిలో భారీ ఎత్తున రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
- వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణంలో భాగంగా కృష్ణా నదిపై నిర్మించిన సరికొత్త వంతెనపై ఈ కార్యక్రమం జరగనుంది.
- ఈ మెగా ఈవెంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు సుమారు 25 వేల మంది పాల్గొని యోగాసనాలు వేయనున్నారు.
- అదే రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో కనీసం 1,000 మందితో నిర్వహించే వేడుకల్లో మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు భాగస్వామ్యం అవుతారు.
Yoga Andhra 2026:అన్ని శాఖల సమన్వయం.. 56 టూరిస్ట్ కేంద్రాల్లో సెషన్స్
ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక విభాగానికే పరిమితం చేయకుండా ఆరోగ్య, మానవ వనరులు, మునిసిపల్, పంచాయతీ రాజ్, దేవాదాయ, ఐటీ శాఖల సమన్వయంతో నిర్వహించనున్నారు.
- పర్యాటక ప్రాంతాల్లో యోగా: ప్రతి జిల్లాలోని రెండు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి, రాష్ట్రవ్యాప్తంగా 56 టూరిస్టు కేంద్రాల్లో ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తారు. ఒక రోజు రెండు జిల్లాల చొప్పున 500 మందితో ఈ ప్రాంతాల్లో యోగా చేయిస్తారు.
- కమ్యూనిటీ భాగస్వామ్యం: 14 రోజుల పాటు పార్కులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ వార్డులు, స్వర్ణ గ్రామం కార్యాలయాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిరంతరం జరుగుతాయి.
- అవార్డుల ప్రకటన: గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్తమ ఈవెంట్స్ నిర్వహించిన వారికి అవార్డులు అందజేస్తారు.
వాట్సాప్ నంబర్తో యోగా వీడియోలు: మంతెన సత్యనారాయణ రాజు
రాష్ట్ర ప్రభుత్వ యోగా, నాచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు రూపొందించిన ‘యోగాంధ్ర’ ప్రత్యేక పోస్టర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. యోగాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాము సిద్ధం చేసిన డిజిటల్ కంటెంట్ వివరాలను ఆయన సీఎంకు వివరించారు.
- వీడియోల వివరాలు: 90 ఆసనాల వీడియోలు, 21 రకాల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సంబంధించిన ప్రత్యేక ఆసనాల వీడియోలు, రోజువారీ సాధన కోసం 7 ప్రాణాయామ వీడియోలను పబ్లిక్ డొమైన్లో ఉంచనున్నారు.
- డౌన్లోడ్ చేసుకునే విధానం: ప్రజలు 8142404888 నంబర్కు వాట్సాప్లో ‘హాయ్’ (Hi) అని మెసేజ్ పంపడం ద్వారా లేదా అధికారిక క్యూఆర్ (QR) కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఈ వీడియోలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు పి. నారాయణ, సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయి ప్రసాద్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, కమిషనర్ వీర పాండియన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

